ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయలేదని హరీశ్ ఆరోపణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 07:02 PM

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, వేలాది విద్యాసంస్థల మనుగడ ప్రమాదంలో పడిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండేళ్లుగా బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని, ఇది సిగ్గుచేటని ఆయన విమర్శించారు.హరీశ్ రావు స్పందిస్తూ"ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు మూతపడే దుస్థితి నెలకొంది. సుమారు 13 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు సైతం వాయిదా వేసే పరిస్థితి వస్తుంటే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఫీజు బకాయిల కోసం సోమవారం నుంచి విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు.ప్రభుత్వ ప్రాధాన్యతలను హరీశ్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. "ఉద్యోగులకు జీతాలు, విద్యార్థులకు ఫీజులు చెల్లించడానికి డబ్బులు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి, కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకు మాత్రం లక్షల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారు మూసీ సుందరీకరణకు రూ. 1.50 లక్షల కోట్లు, ఫ్యూచర్ సిటీకి రూ. 20 వేల కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ. 25 వేల కోట్ల టెండర్లు పిలిచేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయల టెండర్లపై ఉన్న శ్రద్ధ, విద్యార్థుల చదువుపై ఎందుకు లేదు అని హరీశ్ రావు నిలదీశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రస్తుత పరిస్థితిని పోలుస్తూ, తమ హయాంలో పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి తీవ్ర ఆర్థిక సంక్షోభ సమయాల్లోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆపలేదని గుర్తుచేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రూ. 20 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో హామీ ఇచ్చి కూడా ప్రభుత్వం మాట తప్పిందన్నారు.ఫీజులు రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని హరీశ్ రావు అన్నారు. "అద్దెలు, కరెంట్ బిల్లులు కట్టలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. మరోవైపు, ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు నిలిపివేస్తుండటంతో వారు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది" అని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని, యూడైస్ రిపోర్టు ప్రకారం ఈ ఏడాది 47 వేల మంది విద్యార్థులు తగ్గారని ఆయన ఆరోపించారు.ఎన్నికల మేనిఫెస్టోలో గ్రీన్ ఛానెల్‌లో నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మరో పెద్ద పోరాటానికి సిద్ధమవుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa