శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం కూలిన ఘటన జరిగి 200 రోజులు దాటినా ఆరుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ సర్కారు నేరపూరిత నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా ఆయన ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. "అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం 200 రోజులు గడిచినా ఆరుగురు బాధితుల మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయింది. వారి కుటుంబాలకు ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం అందించలేదు" అని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. "కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న సమస్యలకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపి హడావుడి చేసిన బీజేపీ.. ఎస్ఎల్బీసీ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ఎలాంటి దర్యాప్తు బృందాన్ని పంపలేదు? తెలంగాణలో కాంగ్రెస్ (ఛోటే భాయ్)ను బీజేపీ (బడే భాయ్) ఎందుకు కాపాడుతోంది? వీరి మధ్య ఉన్న ఈ అపవిత్ర బంధం ఏమిటి?" అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa