ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలు స్టాపేజీని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 08:11 AM

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో నాగ్‌పూర్- సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలు స్టాపేజీని కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. వందేభారత్ రైలు స్టాపేజీతో మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని ప్రజా ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణకు అన్ని రకాల నిధులు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. 2019 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ప్రారంభించిన చారిత్రాత్మక ‘వందే భారత్’ రైళ్లు నవ భారతంలో నూతన అధ్యాయానికి తెర తీసిందనడంలో సందేహం లేదన్నారు. తెలంగాణలో ఇప్పటికే 5 వందే భారత్ రైళ్లు తిరుగుతుండగా, మరో రెండు రైళ్లను నడపాలనే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిపై త్వరలోనే రైల్వే శాఖ సానుకూల నిర్ణయం తీసుకోబోతోందని వెల్లడించారు.విద్యార్థి దశ నుండి మంచిర్యాలతో మంచి అనుబంధం ఉందని, మంచిర్యాల ప్రజలకు శుభవార్త చెప్పడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అతి త్వరలో రూ.3.5 కోట్ల వ్యయంతో మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రూ.26 కోట్ల అమృత్ భారత్ నిధులతో మంచిర్యాల రైల్వే స్టేషన్‌ను విమానాశ్రయంలా మారుస్తున్నామని తెలిపారు.ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ పార్లమెంట్‌‌లో తనకు అవకాశం వచ్చినప్పుడు మొదటి విషయంగా మంచిర్యాలలో వందేభారత్ ఆపాలని ప్రస్తావించినట్లు తెలిపారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ రైల్వే అనుసంధానం ద్వారా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నిర్వహణ లోపాలతో ఇక్కడి రైతులకు యూరియా ఇబ్బందులు తప్పట్లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa