ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఆర్పీ పేరుతో..కొత్త రాజకీయ పార్టీ పెట్టేసిన తీన్మార్‌ మల్లన్న

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 05:51 PM

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త శక్తి రంగప్రవేశం చేసింది. ఎంఎల్‌సీగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ “తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP)” అనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. బంజారాహిల్స్ తాజ్ కృష్ణా హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ ఆవిష్కరణ జరిగింది. ఎరుపు, ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో రూపుదిద్దుకున్న పార్టీ జెండాను మల్లన్న ఆవిష్కరించారు. రైతుల కష్టానికి ఆకుపచ్చ, కార్మికుల చెమట చుక్కలకు ఎరుపు ప్రతీకగా ఈ రంగులను ఎంపిక చేశారు. జెండా మధ్యలో కార్మిక చక్రం, రెండు ఆలీవ్ ఆకులు, బిగించిన పిడికిలి ప్రతీకలు ఉంచడం ద్వారా “ఆత్మగౌరవం, అధికారం, వాటా” అనే నినాదాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు.


మల్లన్న మాట్లాడుతూ.. ఈ పార్టీని బీసీల ఆత్మగౌరవం, హక్కులు, వాటా కోసం ప్రారంభించామని తెలిపారు. “అధికారాన్ని కేవలం కొద్ది వర్గాలకే పరిమితం చేయకుండా సాధారణ ప్రజలకు అందించడమే లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ మెట్లు ఎక్కని బీసీలను శాసనసభలోకి తీసుకెళ్లే దిశగా టీఆర్పీ ముందుకు సాగుతుందని తెలిపారు. ఇకపై బీ-ఫారమ్ కోసం పెద్ద పార్టీల కార్యాలయాల వద్ద వేచి ఉండే రోజులు ముగిసిపోయాయని మల్లన్న వ్యాఖ్యానించారు.


ఈ కార్యక్రమానికి ముందు కొన్ని రాజకీయ వర్గాల్లో హైడ్రామా చోటుచేసుకుంది. మల్లన్న బీసీయూఎఫ్ వేదికపై రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తారని అంచనాలు వెల్లువెత్తాయి. అయితే అనూహ్యంగా “TRP” పేరుతో కొత్త పార్టీని ఆవిష్కరించడం కొత్త చర్చకు దారితీసింది. బీసీయూఎఫ్ నాయకులు కూడా మల్లన్న తమ సంస్థలో చేరారని, బాధ్యతలు స్వీకరించారని చెప్పడం మరింత గందరగోళాన్ని సృష్టించింది. చివరికి మల్లన్న స్వయంగా వేరే పార్టీని ప్రారంభించడం ద్వారా ఊహాగానాలకు ముగింపు పలికారు.


పార్టీ ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. తీన్మార్ మల్లన్న అధ్యక్షుడిగా, మాదం రజినీకుమార్ యాదవ్, సూదగాని హరిశంకర్ గౌడ్‌లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా వట్టే జానయ్య యాదవ్, సంగెం సూర్యా రావు, పల్లెబోయిన అశోక్ యాదవ్, జ్యోతి పండల్ బాధ్యతలు చేపట్టనున్నారు.


త్వరలోనే యువతకు కూడా కార్యవర్గంలో స్థానం కల్పిస్తామని మల్లన్న హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య పోటీ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్పీ ప్రవేశం ఒక కొత్త మలుపుగా భావించవచ్చు. ముఖ్యంగా బీసీ వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ వేరే పార్టీని స్థాపించడం .. ఇతర పార్టీల ఓటు బ్యాంకులపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa