మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన గొప్ప మనసు చాటుకున్నారు. తన కుమారుడి వివాహ రిసెప్షన్ను రద్దు చేసుకుని, ఆ వేడుక కోసం కేటాయించిన రూ. 2 కోట్లను రైతుల సంక్షేమం కోసం విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.వివరాల్లోకి వెళితే... ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన కుమారుడు సాయి ప్రసన్న వివాహం సందర్భంగా మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని మొదట భావించారు. అయితే, తన నియోజకవర్గంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన చలించిపోయారు. దీంతో వేడుకల ఆడంబరాలకు పోకుండా ఆ డబ్బును అన్నదాతలకు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.ఈ నిర్ణయం మేరకు, తన కుమారుడు సాయి ప్రసన్న, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రూ. 2 కోట్ల చెక్కును సీఎంకు అందించి, ఈ నిధులతో మిర్యాలగూడ నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక బస్తా చొప్పున యూరియాను ఉచితంగా అందించాలని విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రైతులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన బత్తుల లక్ష్మారెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ప్రశంసించారు. ఈ ఆదర్శవంతమైన చొరవ ఎందరికో స్ఫూర్తినిస్తుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa