ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానున్న రోజుల్లో సామాన్యులకి సైతం అందుబాటులోకి విమాన ప్రయాణం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 18, 2025, 03:48 PM

దేశ విమానయాన రంగం గత 11 ఏళ్లలో అద్భుతమైన వృద్ధిని సాధించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2014లో కేవలం 11 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య, 2025 నాటికి 25 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు. ఇది విమానయాన రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.యూపీలోని ఘజియాబాద్, హిండన్ విమానాశ్రయంలో దేశవ్యాప్త 'యాత్రి సేవా దివస్ 2025' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు, అత్యుత్తమ ప్రయాణ అనుభూతిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. "గత 11 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి 'ప్రధాన సేవకుడిగా' పాలన స్వరూపాన్నే మార్చేశారు. ప్రజాసేవకే పెద్దపీట వేశారు. ఆయన స్ఫూర్తితోనే మేము ప్రతి ప్రయాణికుడిని మా ప్రాధాన్యతగా భావిస్తున్నాం" అని రామ్మోహన్ నాయుడు అన్నారు.ప్రధాని మోదీ నాయకత్వంలో విమాన ప్రయాణం కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చిందని మంత్రి వివరించారు. 'ఉడాన్' వంటి పథకాల ద్వారా విమాన ప్రయాణం చౌకగా, సులభంగా మారిందన్నారు. దీనికి ఉదాహరణగా హిండన్ విమానాశ్రయాన్ని ఆయన ప్రస్తావించారు. 2020లో కేవలం ఒకే ఒక్క విమాన సర్వీసు ఉన్న ఇక్కడి నుంచి ఇప్పుడు దేశంలోని 16 నగరాలకు విమానాలు నడుస్తున్నాయని తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa