ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏరుగు అంబేద్కర్ కేసు దర్యాప్తులో వేగం పెంచిన ఏసీబీ అధికారులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 18, 2025, 03:49 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన విద్యుత్ శాఖ ఏడీఈ ఏరుగు అంబేద్కర్ కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. అంబేద్కర్‌కు బినామీగా వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ మరో ఏడీఈ రాజేష్ బాబు ఇంట్లో బుధవారం సాయంత్రం సోదాలు నిర్వహించి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలో నివసిస్తున్న రాజేష్ బాబు నివాసంలో ఏసీబీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో భాగంగా బాత్రూంలో ఒక కవర్‌లో దాచి ఉంచిన రూ.17 లక్షల నగదును అధికారులు గుర్తించారు. నగదుతో పాటు కొన్ని కీలకమైన స్థిరాస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సోదాలు జరిగిన సమయంలో రాజేష్ బాబు ఇంట్లో లేకపోవడం గమనార్హం. ఆయన గత రెండు రోజులుగా విధులకు కూడా హాజరు కావడం లేదని సమాచారం.మరోవైపు, ప్రధాన నిందితుడైన ఇబ్రహీంబాగ్‌ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అంబేద్కర్‌ అక్రమాస్తుల విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని ఏసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఆయన బంధువులు, మరో బినామీ అయిన సతీశ్ ఇళ్లలో జరిపిన సోదాల్లో రూ.2.18 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa