ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో 'బర్త్‌డే బంప్స్' ఇవ్వాలంటూ బాలుడిని కొట్టిన తోటి విద్యార్థులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 18, 2025, 04:01 PM

హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పుట్టినరోజు ఆగస్టు 29న జరిగింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులు అతనికి 'బర్త్‌డే బంప్స్' ఇవ్వాలనే పేరుతో దాడి చేశారు. ఈ క్రమంలో బాలుడి మర్మాంగాలపై విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం జరిగి వృషణాలు వాచిపోయాయి.విషయం తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపల్ వెంటనే స్పందించి బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ కుమారుడి పరిస్థితి చూసి ఆందోళన చెందిన తల్లిదండ్రులు మెరుగైన చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలుడికి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు.ఆపరేషన్ విజయవంతం కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందని, అయితే మూడు నెలల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబసభ్యులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన విద్యార్థులతో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరదా కోసం చేసే పనులు శ్రుతిమించితే ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa