ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి పొంగులేటి బయోపిక్..6 భాషల్లో పాన్ ఇండియా సినిమా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 07:36 PM

కాంగ్రెస్ నేత, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బయోపిక్ తీసేందుకు రంగం సిద్ధమైంది. భయ్యా వెంకట నరసింహ రాజ్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాకు ' శ్రీనన్న అందరివాడు ' అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక తెలుగు, హిందీ, తమిళ్ సహా మొత్తం 6 భాషల్లో ఈ శ్రీనన్న అందరివాడు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది. మరోవైపు.. ఈ సినిమాలో మంత్రి పొంగులేటి పాత్రలో సీనియర్ నటుడు సుమన్ నటించనున్నారు. ‘శ్రీనన్న అందరివాడు’ సినిమాలో.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్నట్లు సినిమా వర్గాలు స్పష్టం చేశాయి.


ఈ శ్రీనన్న అందరివాడు సినిమాకు.. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్టర్, నిర్మాతగా.. భయ్యా వెంకట నరసింహ రాజ్‌ వ్యవహరించనున్నారు. సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడతో పాటుగా అస్సామీలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ శ్రీ వెంకట్ అందిస్తుండగా.. కాసర్ల శ్యామ్ పాటలు రాయనున్నారు. ఈ క్రమంలోనే శ్రీనన్న అందరివాడు సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ శ్రీనన్న అందరివాడు సినిమా పోస్టర్‌లో ఒక వైపు హీరో సుమన్ ఫోటో.. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కనిపిస్తున్నారు.


2014లో వైఎస్సార్సీపీ తరఫున ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత అప్పటి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) తీర్థం పుచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజుకు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత 2023లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి) పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.


అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో అదే ఏడాది జూలైలో ఖమ్మంలో జరిగిన‘తెలంగాణ జన గర్జన బహిరంగ సభలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa