ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఎమ్మెల్యేల జీతం నుంచి నెల నెల బీఆర్ఎస్‌కు రూ.5 వేలు.. రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 07:40 PM

ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి .. పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై నిర్డిష్టమైన నియమాలు ఏవీ స్పష్టంగా లేవని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అంశం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్‌ నాయకులకే స్పష్టత లేదని అన్నారు. తమ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీష్ రావే స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. కానీ, ఇంకో నేత మరో సంఖ్య చెబుతున్నారని అన్నారు. ఇంటికొచ్చిన వాళ్లకు కండువా కప్పితే పార్టీ మారినట్టేనా..?’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని సీఎం స్పష్టం చేశారు.


 టెక్నికల్‌గా చూస్తే వాళ్లు ఏ పార్టీలో ఉన్నారో వాళ్లకే తెలియదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాదు, కాంగ్రెస్‌లో చేరారని చెబుతోన్న ఎమ్మెల్యేల జీతాల నుంచి నెల నెల బీఆర్ఎస్ పార్టీకి రూ.5 వేలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇటీవలే స్పీకర్ నోటీసులకు స్పందించిన పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.


అలాగే, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా సీఎం స్పందించారు. ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బీసీల రిజర్వేషన్ల బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే గడువు అంశం సుప్రీం కోర్టులో ఉందని, దీనిపై న్యాయస్థానం ఏం చెప్తుందో వేచి చూస్తున్నామని అన్నారు. ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలా? వద్దా? అనేది న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.


ఇదే సమయంలో ఇక కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఎపిసోడ్‌పై కూడా సీఎం మాట్లాడారు. అంతా కుటుంబం వివాదమేనని వ్యాఖ్యానించారు. అయితే, కవిత వ్యవహారంలో తమ పాత్ర ఏమీ లేదని తేల్చిచెప్పారు. ఒక ఆడబిడ్డపై నలుగురు మూకుమ్మడిగా దాడిచేస్తున్నారని, కుటుంబ వ్యవహారంతో సామాన్యలకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబాన్ని ప్రజలు ఏనాడో సామాజికంగా బహిష్కరించారని అన్నారు. కేసీఆర్ మొదటి పాలన (2014-19) లో ఒక్క మహిళ మంత్రి కూడా లేరని పేర్కొన్నారు. ఉద్యమం పేరుతో వందల మంది పిల్లల ఉసురు పోసుకున్నారని,అది ఊరికే పోదని విమర్శించారు.


హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం మెలిక పెడుతోందని, కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు, యూరియా విషయంలో బీజేపీ, బీఆర్ఎస్‌లు రాజకీయాలు చేస్తూ.. రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే.. ఇంకా 2 లక్షల టన్నులు కొరత ఉందని అన్నారు. అలాగే, నక్సలైట్లతో చర్చలపై కూడా తన అభిప్రాయం వెల్లడించారు. తీవ్రవాదులతో చర్చలకు సిద్ధంగా ఉన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. మావోయిస్ట్‌లతో చర్చలకు ఎందుకు వెనకాడుతోందని, వాళ్లు కూడా మన అన్నదమ్ములే కదా? అని నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa