ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12 నెలల కూతురుని కిరాతకంగా హతమార్చిన తండ్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 05:36 PM

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మానవత్వం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి, కన్న కూతురినే కిరాతకంగా హతమార్చాడు. ఏడుపు ఆపడం లేదన్న ఆగ్రహంతో ఏడాది పసికందు ప్రాణాలను బలిగొన్న ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే... సూర్యాపేట పట్టణానికి చెందిన వెంకటేశ్‌కు రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడే అలవాటు ఉంది. శుక్రవారం రాత్రి కూడా ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో ఆయన భార్య, భర్త తీరును నిలదీసింది. వారిద్దరూ వాగ్వాదానికి దిగిన సమయంలో వారి 12 నెలల కూతురు భవిజ్ఞ ఏడుపు మొదలుపెట్టింది.అప్పటికే మద్యం మత్తులో భార్యపై కోపంతో రగిలిపోతున్న వెంకటేశ్, బిడ్డ ఏడుపుతో మరింత ఆగ్రహానికి గురయ్యాడు. విచక్షణ కోల్పోయి పసికందు కాళ్లు పట్టుకుని గాల్లోకి విసిరికొట్టాడు. దాంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు పాపను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.అయితే, పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సూర్యాపేట పోలీసులు నిందితుడైన తండ్రి వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. తాగుడు వ్యసనం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa