ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేషెంట్‌కు ఒ పాజిటివ్ బదులు బీ పాజిటివ్ రక్తం.. చివరకు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 21, 2025, 04:38 PM

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఓ పేషెంట్‌కు ఒక బ్లడ్ గ్రూప్ రక్తానికి బదులు మరో బ్లడ్ గ్రూపు రక్తం ఎక్కించారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురానికి చెందిన జ్యోతి తీవ్ర జ్వరం, శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ.. ఈ నెల 16న వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు.. ఆమెకు రక్తం చాలా తక్కువగా ఉందని చెప్పారు. 17న రక్తం కోసం.. శాంపిల్‌ తీసి రక్తనిధి కేంద్రానికి పంపించగా.. టెక్నీషియన్లు ఆమెది బి పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌గా నిర్ధారించారు. జూనియర్‌ డాక్టర్లు ఆ ప్రకారం రక్తం తెచ్చి బాధితురాలికి ఎక్కించారు. ఈ నెల 18న మరో ప్యాకెట్‌ ఎక్కించారు. అయితే, బాధితురాలు తనది ఒ పాజిటివ్‌ అని చెప్పినా.. వార్డులోని సిబ్బంది ఆమె మాట వినలేదు. పాపం ఒ పాజిటివ్ బదులు.. బి పాజిటివ్ ఎక్కించడంతో.. బాధితురాలికి కడుపులో తీవ్ర నొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. శనివారం మరో ప్యాకెట్‌ రక్తం ఎక్కించాల్సి ఉండగా ఆమె బ్లడ్‌ గ్రూప్‌పై కలిగిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి వార్డు సిబ్బంది రక్తనిధి కేంద్రానికి మరోసారి శాంపిల్‌ పంపించారు. టెక్నీషియన్లు ఈసారి ఆమెది ఒ పాజిటివ్‌గా నిర్ధారించారు. వెంటనే వైద్యులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఒక గ్రూప్‌ బదులు మరో గ్రూప్‌ రక్తం ఎక్కించడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదముందని, కొన్నిసార్లు దద్దుర్లు, ఇతర సమస్యలు రావొచ్చని, కొందరిలో మూడు నెలల తర్వాత కూడా సమస్యలు బయటపడతాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్‌ డా.కిశోర్‌కుమార్‌ స్పందించారు.. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని.. పాథాలజీ, జనరల్‌ మెడిసిన్, రక్తనిధి కేంద్రం వైద్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశామని.. బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటామని అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa