ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ డీఎస్పీ నళిని సంచలన ఫేస్‌బుక్ పోస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 21, 2025, 07:11 PM

తెలంగాణ ఉద్యమం కోసం తన డీఎస్పీ పదవికి రాజీనామా చేసి వార్తల్లో నిలిచిన నళిని, తాజాగా మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యారు. 'ఇదే నా మరణ వాంగ్మూలం' అంటూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఓ బహిరంగ లేఖ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తన అనారోగ్యం, రాజకీయ నిర్లక్ష్యం, చివరి కోరికలను వివరిస్తూ ఆమె ఈ లేఖను పోస్ట్ చేశారు.గత కొంతకాలంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో తీవ్రంగా బాధపడుతున్నానని, తన జీవితం ముగింపు దశకు చేరుకుందని నళిని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. సహాయం కోసం ముఖ్యమంత్రికి పెట్టుకున్న దరఖాస్తు బుట్టదాఖలైందని వాపోయారు. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడూ తనను గౌరవించలేదని, తాను చనిపోయాక తన పేరును ఎవరూ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని ఆమె ఆ లేఖలో స్పష్టంగా కోరారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవలేకపోయాననే ఆవేదనను ఆమె పంచుకున్నారు. తన మరణం తర్వాతైనా, తన లక్ష్య సాధన కోసం ప్రధాని ఏదైనా చేయాలని విజ్ఞప్తి చేశారు. తాను స్థాపించిన 'వేదామృతం ట్రస్టు'కు సహాయం అందించాలని కోరారు. వచ్చే జన్మలో మోక్షం కోసం ప్రయత్నిస్తానంటూ భావోద్వేగంగా పేర్కొన్నారు.2010లో భువనగిరి డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో, తెలంగాణ ఉద్యమానికి తన మద్దతు తెలుపుతూ నళిని తన పదవికి రాజీనామా చేయడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉన్నతమైన పోలీసు పదవిని సైతం త్యాగం చేసిన ఆమె, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తనకు సరైన గుర్తింపు దక్కలేదని గతంలో పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం నళిని రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఆరోగ్య పరిస్థితి, ఆవేదనపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆమెకు అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు. ఈ లేఖ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa