హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పలువురు రైతులు భూములు కోల్పోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరం చుట్టూ సగం తెలంగాణను కవర్ చేస్తూ.. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు చేపట్టగా.. ఉత్తర భాగంలోని నిర్వాసితులకు వారం పది రోజుల్లోనే పరిహారం చెల్లింపు ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. భూముల పరిహారంపై పూర్తి స్పష్టత ఇవ్వకుండానే టెండర్లు పిలవడంతో రైతులు మొదట ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు పరిహారం పంపిణీకి వేగంగా అడుగులు పడుతున్నాయి.
నిర్వాసితులకు పరిహారం పంపిణీని రెండు విడతలుగా జరపాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. తొలి విడతలో ఎకరాకు రూ.13 నుంచి రూ.15 లక్షల వరకు చెల్లింపులు జరుగుతాయి. ఈ మొత్తాన్ని స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారు. రెండో విడతలో.. ఎకరాకు రూ.22 నుంచి రూ.25 లక్షల వరకు అదనపు పరిహారం చెల్లిస్తారు. ఈ మొత్తం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేస్తారు. ఈ రెండు విడతలు కలిపి మొత్తం ఎకరాకు రూ.42 లక్షల వరకు పరిహారం అందనుంది. ఈ మేరకు ఇప్పటికే గ్రామాలలో అవార్డులు జారీ చేయడం ప్రారంభించారు.
పరిహారం పంపిణీకి వీలుగా అధికారులు గ్రామాల్లో ఆర్బిట్రేషన్ కోసం నిర్వాసితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కలెక్టర్, ఆర్బిట్రేషన్ అథారిటీ అధికారి పేరుతో రూపొందించిన దరఖాస్తులపై రైతుల సంతకాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలో రైతుల బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలను సేకరిస్తున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం.. రైతుల భూమి విస్తీర్ణం, అందులోని నిర్మాణాలు, చెట్లు, బోర్లు, తోటలు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తులకు చెల్లించే మొత్తం గురించి రైతులకు తెలియజేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
ఈ అంశంపై నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ మాట్లాడుతూ.. రీజినల్ రింగు రోడ్డులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. పరిహారం ఎంత అనే విషయంలో రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. తొలి విడత పరిహారం త్వరలో పంపిణీ చేస్తామని.. ఆ వెంటనే రెండో విడతను కూడా పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa