తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేశారు. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు.
ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వరదలు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వంటివి జరగవచ్చని అంచనా వేశారు. కాబట్టి ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు. వర్షం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఇక జగిత్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఆయా జిల్లాల్లో రాబోయే రెండు మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆఫీసులు, ఉద్యోగాలకు వెళ్లిన వారు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని.. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని చెప్పారు.
ఇక హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం సాయంత్రం తర్వాత కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa