ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్‌కు చెడ్డపేరు తెచ్చేవారిపై మాట్లాడితే తనను బద్నామ్ చేశారన్న కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 06:04 AM

బీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తన కుటుంబం నుంచే దూరం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని ఆమె తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆమె, ప్రసంగం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కొందరు నేతల తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.గ్రామస్థుల ఆహ్వానం మేరకు చింతమడక వచ్చిన కవిత, బతుకమ్మ వేడుకల వేదికపై మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. "సిద్దిపేట, చింతమడకను కొందరు తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారు. నేను ఇక్కడికి వస్తుంటే ఇప్పటికీ ఆంక్షలు పెడుతున్నారు" అని ఆమె విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఇప్పుడు కూడా తనకు అడ్డంకులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమానికి చింతమడక గ్రామమే పునాది అని కవిత గుర్తుచేశారు. "ఈ మట్టి నుంచే ఒక ఉద్యమం మొదలై చరిత్ర సృష్టించింది. కేసీఆర్ గారు ఇక్కడి నుంచే ప్రత్యేక రాష్ట్రం కోసం అడుగు ముందుకేశారు" అని తెలిపారు. చిన్నప్పటి నుంచి ఈ గ్రామంలో కులాలు, మతాలకు అతీతంగా పండుగలు జరుపుకునే సంస్కృతిని చూశానని, అదే స్ఫూర్తితో తాను రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నానని చెప్పారు.ఈ సందర్భంగా తన ఆవేదనను వెళ్లగక్కిన కవిత, "కేసీఆర్‌కు చెడ్డపేరు తెచ్చే వారి గురించి నేను మాట్లాడినప్పుడు, నాపైనే దుష్ప్రచారం చేసి బద్నాం చేశారు. నా కుటుంబం నుంచి నన్ను వేరు చేసిన వాళ్లను నేను వదలను" అంటూ భావోద్వేగంతో హెచ్చరించారు. చింతమడక చిరుతపులులను కన్న గడ్డ అని, ఎన్ని రాజకీయ ఆంక్షలు పెట్టినా మళ్లీ ఇక్కడికి వస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అనంతరం గ్రామస్థులతో కలిసి ఆమె బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa