ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు మరో 2 వందే భారత్ రైళ్లు.. ఆ ప్రాంతానికి ఇక 8 గంటల్లో వెళ్లిపోవచ్చు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 04:52 PM

మన దేశంలో రైల్వే ప్రయాణానికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. పండుగల సీజన్లో అయితే రైల్లో కాలు పెట్టడానికి కూడా జాగా లేనంతగా కిక్కిరిసి ఉంటాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో వేగవంతమైన రైల్వే ప్రయాణం కోసం వందే బారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. 2019 సంవత్సంలో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రారంభం కాగా.. ప్రస్తుతం 150 సర్వీసులు పని చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కూడా వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఈక్రమంలో కేంద్రం.. ప్రయాణికుల రద్దీని బట్టి పలు రాష్ట్రాలకు వందే భారత్ రైళ్ల సంఖ్యను పెంచుతూ పోతుంది. దీనిలో భాగంగా తెలంగాణకు మరో రెండు వందే భారత్ రైళ్లను కేటాయించింది. ఆ వివరాలు..


తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు వందే భారత్ రైళ్లు మంజూరు అయ్యాయి. త్వరలోనే ఇవి పరుగులు తీయనున్నాయి. ఇంతకు కొత్తగా మంజూరు చేసిన రెండు వందే భారత్ రైళ్లు ఏ ప్రాంతాల మధ్య పరుగులు తీయనున్నాయంటే.. నాంపల్లి-పుణె, చర్లపల్లి-నాందేడ్ మధ్య ఈ రెండు వందే భారత్ రైళ్లు నడవనున్నాయి. వీటిల్లో నాంపల్లి, పుణె మధ్య వందే భారత్ రైలును గతంలోనే ప్రతిపాదించగా.. తాజాగా ఆమోదించింది. చర్లపల్లి, నాందేడ్ మధ్య కొత్త సర్వీసుకు తాజాగా ఆమోదం తెలిపింది. హైదరాబాద్ నుంచి పుణె, నాందేడ్ నగరాలకు కొత్తగా రెండు వందే భారత్ రైళ్లు నడవనున్నాయి.


ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మొత్తం 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మంజూరు అయిన రెండు వందే భారత్ ట్రైన్లతో ఆ సంఖ్య 7కు చేరుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తిరుపతి, నాగపూర్, బెంగళూరులకు ఒకటి, విశాఖపట్నానికి రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. అలానే ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి సుమారు 600 కిలోమీటర్లు, అంతకు మించిన దూరం ఉన్న ప్రాంతాలకు మాత్రమే వందే భారత్ రైళ్లను మంజూరు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్ నుంచి కేవలం 281 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాందేడ్‌కు వందే భారత్ రైలును మంజూరు చేయడం సంచలనంగా మారింది. పైగా దీని గురించి గతంలో ఎప్పుడు ప్రతిపాదన రాలేదు. అలాంటిది ఉన్నట్లుండి దీన్ని మంజూరు చేయడం గమనార్హం.


మహారాష్ట్రలో ఉన్నా సరే నాందేడ్ ప్రజలు వివిధ అవసరాల కోసం ఎక్కువగా హైదరాబాద్‌కే వస్తుంటారు. పైగా అక్కడి వ్యాపారులకు తెలంగాణతోనే వాణిజ్య సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్, నాందేడ్ మధ్య బస్సులు, రైలు సర్వీసులు అధికం. దీనికి తోడు ఇదే రూట్‌లో ఉన్న నిజామాబాద్ నుంచి నిత్యం వేల మంది హైదరాబాద్ వస్తుంటారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని.. ఈ మార్గంలో వందే భారత్ రైలు నడిపితే నాందేడ్, నిజామాబాద్ మాత్రమే కాక పరిసర ప్రాంత ప్రజలకు కూడా ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు.


ఇక హైదరాబాద్‌–పుణె నగరాల విషయానికి వస్తే.. ఈ రెండు నగరాల మధ్య కూడా చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య 17 రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో నాలుగు రైళ్లు డెయిలీ తిరుగుతుండగా, శతాబ్ది సర్వీసు వారంలో 6 రోజులు తిరుగుతోంది. మరికొన్ని రైళ్లు.. కొన్ని ప్రత్యేక రోజుల్లో తిరుగుతుంటాయి. ఇప్పుడు వీటితో పాటు వందే భారత్ కూడా చేరింది. హైదరాబాద్, పుణె నగరాల మధ్య దూరం 592 కిలోమీటర్లు. సాధారణ రైళ్లలో ప్రయాణం చేస్తే.. గమ్యం చేరుకోవడానికి 11-13 గంటల సమయం పడుతుంది. అదే సాధారణ రైళ్లు గమ్యం చేరేందుకు 11 గంటల నుంచి 13 గంటల సమయం తీసుకుంటున్నాయి. అందే వందే భారత్ రైలులో ప్రయాణం చేస్తే 8 గంటల్లో చేరుకోవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa