ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగరేణి కార్మికులకు,,,ఒక్కొక్కరికి 1.95 లక్షల బోనస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 22, 2025, 05:52 PM

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా కానుకగా కార్మికులకు బోనస్ ప్రకటించింది. మెుత్తం లాభాల్లో 34 శాతం కార్మికులకు బోనస్‌గా పంచాలని నిర్ణయించింది. గత ఆర్థి సంవత్సరం సింగరేణికి 2,360 కోట్ల లాభం రాగా అందులో 34 శాతం అంటే రూ.819 కోట్లు బోనస్‌గా ప్రకటించారు. ఒక్కో కార్మికుడికి బోనస్ కింద రూ.1,95,610 ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కార్మికులకు బోనస్ ప్రకటించారు.


సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రేవంత్ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. గతేడాది ఒక్కో కార్మికుడికి రూ.5000 వేలు బోనస్ కింద ఇవ్వగా.. ఈ సారి మరో రూ.500 పెంచింది. ఈ ఏడాది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ కింద ఇవ్వనున్నారు. దేశచరిత్రలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సైతం బోనస్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందని, తెలంగాణ ఉద్యమ సమయంలో వారి పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. సింగరేణి సంస్థను కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.


ప్రస్తుతం సంస్థ మొత్తం ఆదాయం రూ. 6,394 కోట్లు కాగా.. ఇందులో నుంచి రూ. 4,034 కోట్లు భవిష్యత్ పెట్టుబడుల కోసం కేటాయించినట్లు వివరించారు. సింగరేణికి ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన గనులను తిరిగి సంస్థకు అప్పగించాలని కార్మికులు చేసిన విజ్ఞప్తిని సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిని తిరిగి లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు.


కాగా, గతేడాది అంటే.. 2023-24 ఏడాదిలో సింగరేణికి 4,701 కోట్లు లాభం వచ్చింది. అందులో 33 శాతం బోనస్‌గా ప్రకటించారు. మెుత్తం రూ.796 కోట్ల లాభాలు కార్మికుల వాటా కింద బోనస్‌గా చెల్లించారు. సగటున ఒక్కొక్క కార్మికుడి అకౌంట్‌లో బోనస్ కింద సుమారుగా రూ.1.90 లక్షల చొప్పున జమ చేశారు. ఈసారి అదనంగా మరో రూ.5610 బోనస్ కింద కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa