సమ్మక్క-సారక్క గద్దెల పుణ్యక్షేత్రమైన మేడారం అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేలా రాతికట్టడాలు నిర్మించాలని స్పష్టం చేశారు. రాతితో కట్టిన నిర్మాణాలు వందేళ్లకుపైగా నిలకడగా ఉండగలవని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో ఆలయాభివృద్ధి పనులు వంద రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పుణ్యకార్యంలో భాగస్వాములైన వారి జీవితం ధన్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిధుల విషయంలో ఎలాంటి వెనుకడుగు ఉండదని.. అవసరమైతే ఎంత ఖర్చైనా చేస్తామని హామీ ఇచ్చారు.
జంపన్న వాగు అభివృద్ధి, నీటి నిల్వలు పెంపు, అవసరమైన చోట చెక్ డ్యాంల నిర్మాణం వంటి చర్యలకు సాగునీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. సమ్మక్క సారలమ్మ మాలధారణలో ఉండే నిబద్ధతతోనే అధికారులు పనిచేయాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి, వారానికోసారి మంత్రి పొంగులేటి పర్యవేక్షణ చేస్తారని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీల సంప్రదాయాలు, పోరాట చరిత్ర, స్ఫూర్తి తరతరాలకు చేరేలా అభివృద్ధి ఉండాలని పేర్కొన్నారు. గత పాలకులు మేడారాన్ని నిర్లక్ష్యం చేశారని, తానే ఇక్కడి నుంచే ప్రజాస్వామ్య పాదయాత్ర ప్రారంభించానని గుర్తుచేశారు. తన పాలన సమ్మక్క సారక్క దీవెనలతో నడుస్తోందని అన్నారు.
అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదని.. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే నిజమైన అభివృద్ధి అని ఆయన స్పష్టం చేశారు. దళితులు, గిరిజనులకు కేబినెట్లో ప్రాధాన్యం ఇవ్వడం, ఐటీడీఏ ప్రాంతాల్లో ఇళ్ల కేటాయింపు, సంక్షేమ పథకాలు అందించడం వంటి అంశాలను ప్రస్తావించారు. మేడారం అభివృద్ధి తన జీవితంలో ప్రత్యేక అనుభూతి అని రేవంత్ అన్నారు. మేడారం జాతరకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారని.. ముఖ్యంగా విదేశీ పర్యాటకులు కూడా తరలివస్తున్నారని సీఎం గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. కుంభమేళాకు వేల కోట్లు కేటాయిస్తారని, అయితే తెలంగాణలోని మేడారం జాతరకు మాత్రం నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. “యూపీలోని అయోధ్య మాత్రమే దేవాలయం కాదు, మేడారం కూడా కోట్లాది భక్తుల మనసుకు ప్రతిబింబం” అని స్పష్టం చేశారు. మేడారం అభివృద్ధి కేవలం నిర్మాణాల పరిమితి కాదని.. ఆదివాసీ సంప్రదాయాలు, వారసత్వాన్ని కాపాడే కృషి కావాలని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెనకడుగు వేయదని, ఎంత ఖర్చయినా సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని ఘనంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మేడారం జాతర 2026 జనవరి 28 నుంచి జనవరి 31వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa