ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. మొత్తం 23 గ్రామాల ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గ్రామాలను గిరిజన గ్రామాలుగా పరిగణిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గిరిజనేతరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
నిజానికి 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మంగపేట మండల పరిధిలోని ఈ 23 గ్రామాలు గిరిజన ప్రాంతాల్లోకి రావని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేయగా.. నిజాం కాలం ఆదేశాలను ఆధారంగా తీసుకుని హైకోర్టు వీటిని గిరిజన గ్రామాలుగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం స్థానికులలో అసంతృప్తి రేపింది. తాము గిరిజనేతరులమని, తమ గ్రామాలను గిరిజన గ్రామాలుగా వర్గీకరించడం అన్యాయమని పిటిషనర్లు వాదించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం (జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్టోయ్) ఈ అంశంపై విచారణ జరిపి హైకోర్టు తీర్పుపై తాత్కాలికంగా స్టే విధించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ స్టే మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ తీర్పుతో మంగపేట మండల ప్రజల్లో మిశ్రమ ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి. గిరిజనేతరులు తమ హక్కులు రక్షించబడ్డాయంటూ సంతోషిస్తుండగా.. గిరిజన సంఘాలు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు చారిత్రక నిజాం ఉత్తర్వులను ఆధారంగా తీసుకోవాలా..? లేక రాష్ట్రపతి ఉత్తర్వులను పరిగణించాలా? అనే చట్టపరమైన వివాదం తలెత్తింది. సుప్రీంకోర్టు తుది తీర్పు ఈ 23 గ్రామాల భవిష్యత్తు హక్కులను నిర్ణయించనుంది. కేసు తుది తీర్పు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందా.. లేదా.. ఆ 23 గ్రామాలను మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా..? అనేది వేచి చూడాలి.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు వేగం అందుకున్నాయి. పంచాయతీలు, మండలాల వార్డులు, సర్పంచ్లు, ఎంపీటీసీల రిజర్వేషన్ ఖరారుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సూచనలతో జిల్లా కలెక్టర్లు పర్యవేక్షణ చేపట్టారు. సెప్టెంబర్ 22న కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, డీపీవోలు, డీఆర్డీవోలు పాల్గొన్న సమావేశంలో మార్గదర్శకాలు అందించారు. పంచాయతీరాజ్ డైరెక్టరేట్ నుంచి వచ్చిన వివరాల ఆధారంగా రిజర్వేషన్ జాబితాలు తయారు చేయాలని నిర్దేశించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియకు అవసరమైన కీలక దశ పూర్తికావచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa