తెలుగు రాష్ట్రాల్లో మద్యం ప్రియులకు ఈసారి దసరా పండుగ కొంత చేదుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా దసరా అనగానే పల్లెల్లోనూ.. పట్టణాల్లోనూ ఉత్సాహం అట్టహాసంగా ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో పూల బతుకమ్మలతో పాటు మాంసం, మద్యం సర్వసాధారణమైపోతాయి. అయితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే అక్టోబర్ 2న దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజున పడటంతో మద్యం, మాంసం అమ్మకాలపై పెద్ద చర్చ సాగుతోంది.
గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా డ్రై డే పాటించడం ఒక సుదీర్ఘ సంప్రదాయం. ఈ రోజున మద్యం దుకాణాలు, బార్లు, పబ్లు పూర్తిగా మూసివేస్తారు. అలాగే మాంసం దుకాణాలు కూడా బంద్ చేస్తారు. అందువల్ల ఈసారి దసరా రోజున మద్యం, మాంసం అందుబాటులో లేకపోవడం ఖాయం అనే భయాందోళనలు ప్రజల్లో కనిపిస్తున్నాయి. అధికారులు ఈ అంశంపై చర్చలు జరుపుతున్నా.. మినహాయింపులు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది.
దీంతో.. దసరా రోజున మద్యం లేకుండా పండుగ జరుపుకోవడం కష్టమని భావించే వారు ముందుగానే తమ అవసరాలకు సరిపడా సీసాలు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత ఏడాది దసరా పండుగలో మద్యం విక్రయాలు విపరీతంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రానికి 11 రోజుల్లోనే రూ.1285 కోట్ల ఆదాయం లభించింది. ఈసారి మాత్రం డ్రై డే కారణంగా అమ్మకాలపై గణనీయమైన ప్రభావం పడనుంది. రాష్ట్ర ఖజానాకు కూడా తగినంత ఆదాయం తగ్గే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.
సమాజంలో కొంతమంది మాత్రం మద్యం లేని దసరా పండుగ గాంధీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటుందని భావిస్తున్నారు. పండుగ అంటే భక్తి, ఆనందం, కుటుంబ సమేతంగా జరుపుకోవడం కావాలని వారు చెబుతున్నారు. మరికొందరు మాత్రం పండుగ కిక్కు సుక్కా ముక్కా లేకుండా అసలు రాదని అంటున్నారు. ఈ భిన్నాభిప్రాయాల మధ్య.. ఈసారి దసరా పండుగ మద్యం ప్రియులకు మరింత సవాలు కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa