తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025-27 సంవత్సరాలకు గాను రెండేళ్ల కాలానికి లైసెన్సులు జారీ చేసేందుకు ఆబ్కారీ శాఖ గురువారం అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు ఈ ప్రక్రియ ద్వారా లైసెన్సులు కేటాయించనున్నారు. ప్రస్తుత దుకాణాల లైసెన్సు గడువు ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఆబ్కారీ శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఈ రోజు నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు ఆసక్తిగల వ్యాపారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. అనంతరం అక్టోబరు 23న లాటరీ పద్ధతి ద్వారా అర్హులకు దుకాణాలను కేటాయిస్తారు. కొత్తగా లైసెన్సులు పొందిన వారు ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి తమ దుకాణాలను ప్రారంభించుకోవాల్సి ఉంటుంది. ఈ లైసెన్సుల కాలపరిమితి 2027 నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.ఈసారి కూడా ప్రభుత్వం రిజర్వేషన్ల విధానాన్ని కొనసాగించింది. మొత్తం దుకాణాలలో 15 శాతం గౌడ సామాజిక వర్గానికి, 10 శాతం ఎస్సీలకు, 5 శాతం ఎస్టీలకు రిజర్వు చేశారు. దరఖాస్తు చేసుకునేందుకు రుసుమును రూ.3 లక్షలుగా ప్రభుత్వం నిర్ధారించింది. రిజర్వేషన్ కోటాలో దరఖాస్తు చేసేవారు కుల ధ్రువీకరణ పత్రాన్ని జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే, స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.దుకాణాల వార్షిక లైసెన్సు ఫీజును జనాభా ప్రాతిపదికన నిర్ణయించారు. 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షల నుంచి మొదలుకొని, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో గరిష్ఠంగా రూ.1.10 కోట్ల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa