హైదరాబాద్ నగరంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఊపందిస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పునరాభివృద్ధి కార్యక్రమం కింద పలు స్టేషన్లు నూతన హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. బేగంపేట స్టేషన్ ఆధునిక వసతులతో ఇటీవల ప్రారంభమవ్వగా.. హఫీజ్పేట స్టేషన్ పనులు 85 శాతం పూర్తయ్యాయి. మరో 45 రోజుల్లో మిగిలిన పనులు ముగించి.. రెండు నెలల్లో ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.
హైటెక్సిటీ, ఉప్పుగూడ, మలక్పేట్, మల్కాజిగిరి, ఉందానగర్, యాకుత్పురా స్టేషన్ల పునరాభివృద్ధి కూడా వేగం అందుకుంది. ముఖ్యంగా ప్రయాణికుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అన్ని స్టేషన్లలో లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, 12 మీటర్ల పొడవైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు. స్టేషన్ భవనాల మెరుగుదల, ప్లాట్ఫామ్ పైకప్పులు, సర్క్యులేటింగ్ ఏరియా, టాయిలెట్ బ్లాక్లు, సూచిక బోర్డులు, లైటింగ్ పనులు దాదాపు పూర్తయి తుదిదశకు చేరుకున్నాయి. వెయిటింగ్ హాల్స్ కూడా ఆధునిక సౌకర్యాలతో నూతనంగా రూపుదిద్దుకుంటున్నాయి.
హఫీజ్పేట స్టేషన్ అభివృద్ధి పనులకు రూ.29.21 కోట్లు వ్యయం అవుతోంది. ఇది సబర్బన్ గ్రేడ్–3 కేటగిరీలోకి వస్తుంది. రోజువారీగా సుమారు 9,000 ప్రయాణికులు ఈ స్టేషన్ను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ రోజుకు 60 ఎంఎంటీఎస్ రైళ్లు, 8 ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతున్నాయి. ఈ సౌకర్యాలు పూర్తయ్యాక ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం కలిగే అవకాశం ఉంది. ప్రయాణికులు ముఖ్యంగా హైటెక్ సిటీ, మలక్పేట్ వంటి స్టేషన్ల ఆధునీకరణతో రద్దీ తగ్గుతుందని ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలు వల్ల నగర రైల్వే సేవలు మెరుగుపడి, సమయపాలన పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో స్మార్ట్ డిస్ప్లే బోర్డులు, వైఫై సదుపాయాలు, పర్యావరణహిత లైటింగ్ వంటి వసతులు కూడా చేరుస్తారని అధికారులు తెలిపారు.
అమృత్ భారత్ స్టేషన్ కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వరంగల్, ఖమ్మం, సికింద్రాబాద్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ పనుల కారణంగా.. చాలా వరకు రైళ్లను చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ వంటి రైల్వే స్టేషన్లను నుంచి స్టార్ట్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అంతే కాందు.. సిటీకి దూరంగా ఉన్న చర్లపల్లికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు అధికంగా అవుతున్నాయని.. పునరాభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రయాణికులు రైల్వే అధికారులను కోరుతున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్లేందుకు రవాణా సదుపాయాలను కల్పించాలని.. ప్రైవేట్ వాహనాల అధిక ఛార్జీల ధరలను ప్రభుత్వం నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa