తెలంగాణలో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రాష్ట్ర రాజకీయాల్లో వేడి చెలరేగుతోంది. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ధీమా వ్యక్తం చేశారు. దీని కోసం బీఆర్ఎస్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫార్మ్హౌస్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్ తదితరులతో సమావేశం నిర్వహించి ఎన్నికల వ్యూహంపై చర్చించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్లో రాజకీయ సమీకరణాలు తమకు అనుకూలంగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయని తెలిపారు. స్థానిక స్థాయిలోని శ్రేణులు ప్రజల్లో అవగాహన పెంపొందించి ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలు పెంపొందించాలని ఆదేశించారు. కాంగ్రెస్ పాలనలో అమలుకాలేని హామీలను ప్రజల ముందుంచి, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి నమ్మకం పొందాలని సూచించారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్పై విసుగుతో ఉన్నందున, ఇది పార్టీకి అవకాశం కలిగిస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంలో బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిగా మాగంటి సునీతను అధికారికంగా ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ జూన్ 8న అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. గోపినాథ్ స్థానంలో ఆయన భార్య సునీతను బరిలోకి దింపుతూ కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. పార్టీ నాయకత్వం సునీత విజయానికి మద్దతుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోపాటు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయి కార్యకర్తలను అప్రమత్తం చేయాలని కేసీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు పలు ప్రచార పథకాలు రూపొందిస్తున్నాయి. ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మాగంటి గోపీనాథ్ గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి విజయం సాధించారు. BRS పార్టీ తరపున 2018, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే.. 2025, జూన్ 8వ తేదీన ఆయన హఠాత్తుగా మరణించారు. మరణానికి కొద్ది రోజుల ముందు.. జూన్ 5వ తేదీన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ AIG హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa