ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏటీసీల్లో చేరే విద్యార్థులకు నెలకు రూ.2 వేలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 07:36 PM

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఐటీఐలను.. ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఆధునీకరించడానికి.. రేవంత్ సర్కార్.. టాటా టెక్నాలజీస్‌తో కలిసి.. ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా(ఏటీసీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాడు 65 ఏటీసీలను ప్రారంభించారు. మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణం వేదికగా వర్చువల్‌గా ఏటీసీల ప్రారంభోత్సవం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్రంలో 116 ఏటీసీలను ఏర్పాటు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగాలు ఉన్నప్పటికీ, యువతలో సరైన నైపుణ్యాలు లేవని తమ దృష్టికి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలు కూడా అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ ఆలోచనతోనే రాష్ట్రంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాము అన్నారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్‌లుగా మార్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. 2024 జూన్‌లో శంకుస్థాపన చేసిన తర్వాత, కేవలం సంవత్సర కాలంలో 65 ఏటీసీ కేంద్రాల నిర్మాణం పూర్తయింది అని తెలిపారు. ఒక్కో ఏటీసీ కేంద్రంలో 200 వరకు సీట్లు ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు లేకుండా మొత్తం టాటా సంస్థనే భరించింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.


65 ఏటీసీల అభివృద్ధికి మొత్తం రూ. 2,400 కోట్లు ఖర్చు అయ్యిందని సీఎం రేవంత్ తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు భరిస్తుంది. మిగిలిన రూ. 2,100 కోట్లను టాటా టెక్నాలజీస్‌ భరించింది అని సీఎం చెప్పుకొచ్చారు. ఈ ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ పొందిన వారిలో 90 శాతం మందికి ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు. త్వరలో మరో 53 ఏటీసీలని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం స్పష్టం చేశారు


నైపుణ్యం లేకపోతే ఇంజినీరింగ్ పట్టా ఉన్నా ఉపయోగం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నైపుణ్యాలు లేకపోవడం వల్ల యువతకు ఉద్యోగాలు రావడం లేదని.. దీనివల్ల వారు చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే రాష్ట్రంలో గంజాయి కేసులు పెరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.


ఏటీసీల్లో శిక్షణ పొందే విద్యార్థికి ప్రతి నెల రూ.2 వేల స్టైఫండ్‌ ఇచ్చే ఆలోచన చేస్తున్నామని సీఎం తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఏటీసీలో మొత్తం 11,008 సీట్లు ఉన్నాయని.. వీటిలో 99 శాతానికి పైగా సీట్లు ఇప్పటికే భర్తీ అయ్యాయని చెప్పుకొచ్చారు. ఏటీసీల్లో చదివి విదేశాల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు పొందిన వారు కూడా ఉన్నారని సీఎం తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa