తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రిజర్వేషన్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయడానికి నిర్ణయించిన నేపథ్యంలో.. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని ఆయన పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరి..
తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గాలకు రాజకీయ, ఆర్థిక రంగాలలో చేయూతనిచ్చేందుకు ఈ 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. చాలా ఏళ్లుగా ఈ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురయ్యారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ రిజర్వేషన్లను అమలు చేసేందుకు అన్ని ప్రభుత్వపరమైన ఏర్పాట్లను చేస్తున్నామని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రభుత్వం తమ అడుగు వెనుకకు వేయబోదని ఆయన అన్నారు.
విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా ఈ రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ప్రభుత్వం రిజర్వేషన్లను కల్పించే కర్తవ్యాన్ని చేపట్టిందని.. అయితే వాటిని న్యాయపరమైన చిక్కుల నుండి కాపాడుకునే బాధ్యత ప్రజలదని పేర్కొన్నారు.
న్యాయపరమైన సవాళ్లు, ఆందోళన..
బీసీ రిజర్వేషన్ల అంశం తరచుగా న్యాయస్థానాల పరిధిలోకి వెళ్తున్న నేపథ్యంలో, మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా నోటి కాడి ముద్దను కోర్టుకు వెళ్లేవారు లాక్కోవద్దు. చేతులెత్తి మొక్కుతున్నాను’ అంటూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎవరూ నిలబడొద్దని ఆయన వినయంగా వేడుకున్నారు. తాము ఎవరి హక్కులనూ హరించడం లేదని, తమిళనాడు వంటి రాష్ట్రాలలో అమలవుతున్న రిజర్వేషన్ల తరహాలోనే సామాజికంగా, చట్టపరంగా ఇక్కడ కూడా అర్హత మేరకు అందించడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు.
బీసీ రిజర్వేషన్లకు ఎవరైనా అడ్డుతగిలితే.. సామ, దాన, భేద, దండోపాయాలను వినియోగించడానికి కూడా వెనుకాడబోమని ఆయన గట్టి హెచ్చరిక చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యూనివర్సిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా వెళ్లినవారికి ఎదురైన పరిస్థితులను ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున రవీంద్రభారతిలో నిర్వహించిన వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 130వ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ పౌరుషమూర్తి పోరాట స్ఫూర్తిని బీసీలు తీసుకోవాలని సూచించారు. ఐలమ్మపై ఇనగుర్తి మధు రచించి, ఆలపించిన పాట, పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa