దాదాపు 60 ఏళ్ల విరామం తర్వాత ఉస్మాన్ సాగర్ (గండిపేట)కు భారీగా వరద నీరు చేరిందని హైదరాబాద్ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ ప్రభావంతో, 15 గేట్లను ఎత్తి, ముసీ నదిలోకి వరద నీటిని విడుదల చేసినట్టు ఆయన వెల్లడించారు.వికారాబాద్ జిల్లాలో నమోదైన భారీ వర్షాల వల్ల, కేవలం 4–5 గంటల వ్యవధిలోనే ఉస్మాన్ సాగర్కు 16,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చిందని ఆయన వివరించారు. పరిస్థితిని క్షణక్షణం క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమీక్షిస్తూ, అవసరమైన మేరకు గేట్లను సకాలంలో ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.డ్యామ్ నిర్మాణ దశలోనే వరద నియంత్రణకు సంబంధించిన సాంకేతిక ప్రమాణాలు స్పష్టంగా పేర్కొనబడినట్లు, వాటినిబట్టి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గండిపేట గేట్ల ఎత్తడం కూడా అదే ప్రణాళిక ప్రకారమే జరిగిందని వివరించారు.గత 25 ఏళ్లలో శంకర్ పల్లి వంతెన వద్ద నీటి మట్టం ఎప్పుడూ 10 అడుగులను దాటలేదని, ఈసారి అది 16.5 అడుగులకు చేరడంతో వరద తీవ్రతను అంచనా వేసి, నీటిని సమర్థంగా విడుదల చేసినట్టు అశోక్ రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా వరద ప్రవాహంపై పర్యవేక్షణ కొనసాగుతోందని, అలాగే వాతావరణ శాఖ అందిస్తున్న డేటాను ఆధారంగా తీసుకుని ఎగువ ప్రాంతాల్లో పరిస్థితిని ముందే అంచనా వేసి, సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa