ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో కొత్త యూనివర్సిటీ.. పనులు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 28, 2025, 07:05 PM

ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద ప్రతిష్టాత్మక సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం  ఏర్పాటుకు సంబంధించిన ముఖ్య ఘట్టం నేడు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.


ఈ గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా ఈ ప్రాంత యువతకు ఉన్నత విద్యావకాశాలు మెరుగుపడతాయని, ముఖ్యంగా గిరిజన విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ప్రతిభను పెంచుకునేందుకు ఇదొక బలమైన వేదిక అవుతుందని ఆమె అన్నారు. రూ. 24 కోట్ల వ్యయంతో 8.4 కిలోమీటర్ల పొడవైన ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జి. నాగేష్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యం ఇస్తుందని.. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు సమకూర్చుతామని హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం ఆధునిక గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, హాస్టళ్లు, తరగతి గదులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ములుగు జిల్లాకు ఈ విశ్వవిద్యాలయం ప్రత్యేక గౌరవాన్ని, విద్యా రంగంలో కొత్త మైలురాయిని అందిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ.. ఈ నూతన విశ్వవిద్యాలయంలో 80 శాతం ప్రవేశ అవకాశాలు స్థానిక విద్యార్థులకే దక్కుతాయని స్పష్టం చేశారు. ఇది ప్రాంతీయ ప్రతిభను వెలికి తీయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.


ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు నాగేష్.. ఈ ప్రాంత గిరిజనుల విద్యాభివృద్ధి, వారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు విశ్వవిద్యాలయం దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే.. ఇది ఆర్థిక అభివృద్ధిలోనూ ముఖ్య భూమిక పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు సెంట్రల్ గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు.


జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లలో 3 వేల నుంచి 5 వేల మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం 42 మంది విద్యార్థులు కేంద్రీయ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు పొంది విద్యనభ్యసిస్తున్నారని, వారికి నైపుణ్యాభివృద్ధి కోసం టాస్క్ సెంటర్ ద్వారా శిక్షణ కూడా అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa