నాల్గున్నర సంవత్సరాలకు పైగా టీజీఎస్ఆర్టీసీ సారథిగా పనిచేసిన వీసీ సజ్జనార్ ఐపీఎస్ బదిలీ సందర్భంగా చేసిన ఒక భావోద్వేగ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన పదవీ విరమణ సందేశాన్ని ఒక ప్రయాణంతో పోల్చుతూ రాసిన విధానం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.
ఆర్టీసీ సేవలకు సెలవు.. సజ్జనార్ ట్వీట్
‘సుసంపన్నమైన నాలుగేళ్లకు పైగా టీజీఎస్ఆర్టీసీకి నాయకత్వం వహించిన తర్వాత, ఈ 'బస్సు' దిగి.. కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం వచ్చింది. ప్రయాణాలు ఆగవచ్చు, ప్రయాణికులు ముందుకు సాగవచ్చు.. కానీ రహదారి ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ బస్సును పార్క్ చేసి, తదుపరి సవాలు వైపు వేగంగా పయనించాలి’ అంటూ సజ్జనార్ తన బదిలీని అత్యంత హుందాగా ప్రకటించారు.
ఆయన ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘టీజీఎస్ఆర్టీసీకి ప్రధాన ఆధారం అయిన డ్రైవర్లు, కండక్టర్లకు.. అలాగే సంస్థను నడిపించిన ప్రతి అధికారికి, ప్రయాణికులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఆయన దృష్టిలో ప్రజా రవాణా కేవలం ప్రయాణం మాత్రమే కాదని, ‘ఆరోగ్యకరమైన పర్యావరణం, ఆరోగ్యవంతమైన జీవితం’ కోసం తీసుకునే ఒక గొప్ప నిర్ణయమని భావించారు. తాను ఎప్పటికీ ప్రజా రవాణాకు గర్వించదగిన ప్రతినిధిగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ అద్భుత ప్రయాణంలో తాను పొందిన అనుభవాలు, గుణపాఠాల గురించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు.
ఆర్టీసీకి సజ్జనార్ అందించిన సేవలు..
వీసీ సజ్జనార్ సంస్థకు ఎండీగా పనిచేసిన కాలం టీజీఎస్ఆర్టీసీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆయన తన పదవీకాలంలో ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయడంలో, సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.
సరుకు రవాణా (కార్గో) సేవలను వినూత్నంగా విస్తరించి, సంస్థకు అదనపు ఆదాయ వనరులను సృష్టించారు. టికెట్ బుకింగ్, బస్సు ట్రాకింగ్ వంటి సేవలను సాంకేతికంగా మెరుగుపరిచారు. 'మన ఆర్టీసీ' నినాదంతో సంస్థకు కొత్త బ్రాండింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాను యాక్టివ్ గా ఉపయోగించి.. ప్రజలతో మెరుగైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం వంటి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ముఖ్యపాత్ర వహించారు. సామాన్య ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణించి.. వారి సమస్యలను, అవసరాలను స్వయంగా తెలుసుకోవడం ద్వారా ఆర్టీసీ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు. ఆయన సేవలను గుర్తిస్తూ, ప్రభుత్వం వీసీ సజ్జనార్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా బదిలీ చేసింది. ఈ కొత్త సవాలులో కూడా ఆయన తనదైన శైలిలో దూకుడుగా పనిచేస్తారని అందరూ ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa