తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుభవార్త అందించారు. ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి రూ. 104 కోట్ల బిల్లులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని త్వరలోనే కార్యదర్శుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పరిపాలన వ్యవస్థకు వెన్నెముకగా ఉండే పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
ఒకే దఫాలో ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించడం, ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని వెల్లడిస్తోంది. ఈ ఆర్థిక చర్య పట్ల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులు విడుదల కావడం వల్ల కార్యదర్శులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులు గ్రామీణ అభివృద్ధి పథకాలు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పన, పన్నుల వసూలు వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తారు. గత కొన్ని నెలలుగా వారి బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడంతో వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పాలనలో జాప్యానికి తావు లేకుండా ఉద్యోగులకు సకాలంలో చెల్లింపులు చేయాలనే సంకల్పాన్ని ఈ చర్య ద్వారా తెలియజేసింది. ముఖ్యంగా.. గ్రామ పంచాయతీల బలోపేతానికి, పరిపాలనలో పారదర్శకత తీసుకురావడానికి ఈ కార్యదర్శులు నిరంతరం శ్రమిస్తారు. వారికి సకాలంలో ఆర్థిక సహాయం అందించడం వలన.. వారు మరింత ఉత్సాహంతో, నిబద్ధతతో పనిచేసే అవకాశం ఉంది.
ఈ ఆర్థిక సహాయం, పెండింగ్లో ఉన్న వివిధ గ్రామీణ పథకాల అమలుకు, ఇతర నిర్వహణ ఖర్చులకు కూడా కొంతవరకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామీణాభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దసరా పండగ సందర్భంగా ఈ నిధులు విడుదల కావడంతో కార్యదర్శులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి పెద్ద ఎత్తున అవకాశం కల్పించగా, వారిలో చాలామంది శాశ్వత ఉద్యోగులుగా మారారు. 2018 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 9 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుతం చాలా మంది గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పెద్ద పోస్టులకు ఎంపిక కావడంతో వెళ్లిపోయారు. దీంతో చాలా వరకు వీటిలో ఖాళీ పోస్టులు ఏర్పడ్డాయి. వీటిని తెలంగాణ ప్రభుత్వం తదుపరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa