భారతీయ రైల్వే శాఖ తీసుకున్న ఒక తెలివైన నిర్ణయం ఇప్పుడు సికింద్రాబాద్-నాగ్పూర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు కొత్త ఊపిరి పోసింది. ప్యాసింజర్ల రద్దీ లేదనే కారణంగా కోచ్ల సంఖ్యను తగ్గించి.. ఆ తరువాత రూట్ మ్యాప్లో చేసిన మార్పులు ఇప్పుడు అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయి. ఈ ప్రణాళికాబద్ధమైన చర్యలకు రైల్వే శాఖ ఆలోచనకు సలాం కొట్టాల్సిందే.
గత సంవత్సరం సెప్టెంబర్లో సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య వందేభారత్ సర్వీసు ప్రారంభమైనప్పుడు.. ఇది 20 కోచ్లతో నడిచిన దేశంలోనే రెండో సర్వీసుగా నిలిచింది. కానీ, ఆక్యుపెన్సీ రేషియో (సీట్ల వినియోగ నిష్పత్తి) 30 శాతం కూడా నమోదు కాకపోవడంతో.. రైల్వే శాఖ వెంటనే స్పందించి.. కోచ్ల సంఖ్యను కేవలం 8కి తగ్గించింది. దీంతో ఈ సర్వీసు మినీ వందేభారత్గా మారింది. అయితే.. కోచ్లు తగ్గించినా ఆక్యుపెన్సీ కేవలం 75 శాతం నుంచి 85 శాతం మధ్యనే ఉండిపోయింది. దీనిపై దృష్టి పెట్టిన రైల్వే శాఖ లోపం ఎక్కడుందో తెలుసుకునేందుకు ఒక సమగ్ర రూట్ సర్వే నిర్వహించింది.
సర్వేలో తేలిందేమిటంటే.. ఈ రూట్లో అత్యధిక మంది ప్రయాణికులు నాగ్పూర్ లేదా సికింద్రాబాద్తో పాటు మంచిర్యాల మరియు సిర్పూర్-కాగజ్నగర్ ప్రాంతాల నుంచి ప్రయాణించాలనుకుంటున్నారు. కానీ.. ఈ రెండు ముఖ్యమైన పట్టణాల్లో రైలుకు హాల్ట్ లేదు. ప్రయాణికుల అవసరాలను గుర్తించిన రైల్వే శాఖ వెంటనే అప్రమత్తమై.. పది రోజుల క్రితం ఈ రెండు ప్రాంతాలలో స్టాప్లను అందుబాటులోకి తెచ్చింది.
రైల్వే శాఖ తీసుకున్న ఈ వ్యూహ ఫలితం తక్షణమే కనిపించింది. స్టాప్లు అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆక్యుపెన్సీ రేషియో ఒక్కసారిగా వంద శాతాన్ని మించింది. ప్రస్తుతం ఈ 8 కోచ్ల మినీ వందేభారత్లో సుమారు 550 సీట్లు ఉండగా.. 600కు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇది రైల్వే అధికారులు ఎంత తెలివైన ఆలోచనతో పని చేశారో తెలియజేస్తుంది.
అదనపు ఆదాయమే దీనికి నిదర్శనం..
కొత్త స్టాప్లు ప్రారంభించిన తరువాత రైల్వే శాఖకు అదనంగా వచ్చిన ఆదాయమే దీని సక్సెస్ ఫార్ములాను రుజువు చేస్తుంది. సెప్టెంబర్ 22న సికింద్రాబాద్-నాగ్పూర్ ట్రిప్లో మొత్తం 588 మంది ప్రయాణించారు. ఇందులో అత్యధికంగా నాగ్పూర్ (40 శాతం), ఆ తర్వాత మంచిర్యాలలో (18 శాతం) ప్రయాణికులు దిగారు. ఆ ఒక్కరోజు ఈ రెండు కొత్త స్టాప్ల ద్వారా రైల్వేకు అదనంగా రూ.2.06 లక్షల ఆదాయం వచ్చింది.
సెప్టెంబర్ 24న 605 మంది ప్రయాణించగా.. మంచిర్యాల, సిర్పూర్ స్టాప్ల ద్వారా ఏకంగా రూ.2.63 లక్షల అదనపు ఆదాయం సమకూరింది. ఈ గణాంకాలు రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం ఎంత సరైందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మొదట కోచ్లు తగ్గించడం, తర్వాత లోపాన్ని గుర్తించి కీలకమైన స్టాప్లను అందించడం ద్వారా రైల్వే శాఖ ప్రయాణికుల అవసరాలను అర్థం చేసుకుని.. సమర్థవంతంగా సేవలు అందిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఈ వ్యూహాన్ని చూసిన వారెవరైనా భారతీయ రైల్వే శాఖ తెలివైన ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa