ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్‌ఫాస్ట్ రైలుగా మారిన శబరి ఎక్స్‌ప్రెస్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 05:15 PM

సికింద్రాబాద్- తిరువనంతపురం (త్రివేండ్రం) మధ్య ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ మార్గంలో ఎంతో కీలకమైన శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్ రైలుగా మార్చింది. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. రైలు వేగం పెరగడం వల్ల ప్రయాణికులకు సుమారు రెండు గంటల ప్రయాణ సమయం కలిసి రానుంది.ఈ మార్పులో భాగంగా రైలు నంబర్‌ను కూడా మార్చారు. ఇప్పటివరకు 17229/30 నంబర్లతో నడిచిన ఈ రైలు, ఇకపై 20629/30 నంబర్లతో సూపర్‌ఫాస్ట్‌గా పరుగులు పెట్టనుంది. రైలు వేగాన్ని పెంచడంతో పాటు, ప్రయాణ వేళల్లో కూడా అధికారులు కీలక మార్పులు చేశారు.కొత్త టైమింగ్స్ ప్రకారం సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:25 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. గతంలో ఈ రైలు మధ్యాహ్నం 12:20 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6:05 గంటలకు గమ్యస్థానానికి చేరేది.అదేవిధంగా తిరుగు ప్రయాణంలో, తిరువనంతపురంలో ఉదయం 6:45 గంటలకు బయలుదేరే సమయం యథాతథంగా ఉన్నప్పటికీ, సికింద్రాబాద్‌కు మాత్రం ఉదయం 11 గంటలకే చేరుకుంటుంది. ఇంతకుముందు ఈ రైలు మధ్యాహ్నం 12:45 గంటలకు సికింద్రాబాద్ చేరేది. ఈ మార్పుల వల్ల ప్రయాణికులు మరింత వేగంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని రైల్వే వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa