భారత్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతుతో పనిచేస్తున్న దావూద్ ఇబ్రహీం సిండికేట్ (డి-కంపెనీ) ఇప్పుడు తన మకాంను దక్షిణ భారతానికి మార్చింది. ముఖ్యంగా కేరళను అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకు ప్రధాన కేంద్రంగా మార్చుకుని దేశ భద్రతకు పెను సవాల్ విసురుతోంది. నకిలీ కరెన్సీ రాకెట్ను భారత ఏజెన్సీలు సమర్థంగా అడ్డుకోవడంతో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోవడం కోసం డి-కంపెనీ ఇప్పుడు పూర్తిగా డ్రగ్స్ వ్యాపారంపై ఆధారపడినట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటివరకు పంజాబ్ సరిహద్దుల ద్వారా డ్రగ్స్ను దేశంలోకి పంపిన మాఫియా, అక్కడ భద్రతా బలగాల నిఘా పెరగడంతో తమ వ్యూహాన్ని మార్చుకుంది. పాకిస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను శ్రీలంకకు చేర్చి, అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేరళ తీరానికి తరలిస్తున్నారు. కేరళకున్న సుదీర్ఘ తీరప్రాంతం, అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఉండటం, స్థానిక వ్యవస్థలోని అవినీతి వంటి అంశాలు డ్రగ్స్ ముఠాలకు అనుకూలంగా మారాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల నలుగురు జైలు అధికారులు ఖైదీలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడటం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.దక్షిణ భారతంలో డి-కంపెనీ కార్యకలాపాలను దావూద్ ముఖ్య అనుచరుడైన హాజీ సలీం పర్యవేక్షిస్తున్నట్లు ఏజెన్సీలు గుర్తించాయి. కేరళలో బలమైన నెట్వర్క్ను నిర్మించుకున్న సలీం, ఇక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు డ్రగ్స్ను సరఫరా చేస్తున్నాడు. ముఖ్యంగా మెథాఫెటమిన్ (మెత్) అనే డ్రగ్కు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండటంతో కేరళను ఒక ట్రాన్సిట్ పాయింట్గా వాడుకుంటున్నారు. ఇక్కడికి చేరిన డ్రగ్స్ను రోడ్డు మార్గంలో తమిళనాడు, కర్ణాటక మీదుగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను గంజాయి రవాణాకు వినియోగిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa