ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ,,,ఐబొమ్మ నిర్వాహకులకు సీవీ ఆనంద్ వార్నింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 06:49 PM

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తాజాగా సినిమాల పైరసీకి పాల్పడే పెద్ద గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ముఠా సభ్యులు.. తెలుగు సినిమాలను మాత్రమే కాక.. ఇతర భాషల చిత్రాలను కూడా పైరసీ చేసి.. భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠా వల్ల తెలుగు మూవీ ఇండస్ట్రీకి సుమారుగా రూ.3,700 కోట్ల నష్టం వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ముఠా టెలిగ్రామ్‌ ఛానల్స్‌, టొరెంట్స్‌, డిజిటల్ శాటిలైట్ హ్యాకింగ్, డిజిటల్ మీడియా సర్వర్స్‌ను హ్యాక్ చేయడంతో పాటు థియేటర్లలో కెమెరా రికార్డింగ్‌ వంటి పద్ధతుల ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్నారు. ఇలా పైరసీ చేసిన సినిమాలను.. అప్‌లోడ్ చేసి, బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రకటనల ద్వారా ఈ గ్యాంగ్ భారీగా డబ్బులు సంపాదించారని పోలీసులు తెలిపారు.


ఈ సందర్బంగా సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ అభిమానులకు చిరపరిచతమైన ఐబొమ్మ నిర్వాహకులకు సీవీ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు సినిమాలను మాత్రమేకాక ఓటీటీ కంటెంట్‌ను కూడా హెచ్‌డీ క్వాలిటీలో ఉచితంగా ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీనివల్ల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, హాట్‌స్టార్, ఆహా, జియో వంటి వాటికి సబ్‌స్క్రిప్షన్‌లు తగ్గుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అలానే థియేటర్లలో విడుదలైన సినిమాలకు సంబంధించి తొలి రోజే హెచ్‌డీ ప్రింట్లు బయటకు వస్తున్నాయి.


దీంతో ఐబొమ్మ నిర్వాహకులకు సీవీ ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. అలానే ఈ పైరసీ వెనుక బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, హ్యాకర్ల పాత్ర ఉందని ఈ సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, దిల్ రాజు, నాని, రామ్, నాగచైతన్యలకు వివరించారు. అయితే సీవీ ఆనంద్ గతంలో కూడా ఐబొమ్మ వెబ్‌సైట్‌కు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.


ఈ సందర్భంగా పోలీసులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాలు ఎలా పనిచేస్తాయో సినీ ప్రముఖులకు వివరించారు. సినిమాలు థియేటర్లలో విడుదల కాకముందే హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో తెలుసుకుని సెలబ్రిటీలు ఆశ్చర్యపోయారు. హ్యాకర్లకు, పైరసీ ముఠాలకు బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులే సహకరిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు.


ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాం. ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాము. దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి పైరసీ ముఠాను పట్టుకున్నాము. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను సైతం అరెస్ట్ చేస్తాం’ అని తెలిపారు. ఐబొమ్మకు చెందిన నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అసలు వ్యక్తి ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదట.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa