ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్‌కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.. పండగ పూట రేషన్ బంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 06:53 PM

పండగ పూట సామాన్యులు, పేదలకు రేషన్ డీలర్లు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రతి నెల ఫస్ట్ తారీఖున రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈసారి దసరా పండుగ కూడా అక్టోబర్ 2ననే వస్తుంది. దీంతో రేషన్ షాపుల వద్ద భారీ క్యూ ఉంటుందని భావించారు. తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో.. చాలా మంది జనాలు వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం ధర చాలా వరకు తగ్గిపోయింది. పండగ పూట సన్న బియ్యం తీసుకుని.. పండగ చేసుకుందామనుకున్న లబ్ధిదారులుకు ఇది నిజంగా భారీ షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రేపటి నుంచి అనగా అక్టోబర్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ దుకాణాలు బంద్ కానున్నాయి.


తెలంగాణలో రేపటి నుంచి అనగా అక్టోబర్ 1 నుంచి రేషన్‌ దుకాణాలు మూతపడనున్నాయి. రేషన్ డీలర్లు బంద్‌కు పిలుపునివ్వడంతో.. రేషన్ దుకాణాలు బంద్ కానున్నాయి. గతంలో పలు డిమాండ్లకు సంబంధించి.. రేషన్‌ డీలర్ల సంఘం చేపట్టిన నిరసనలు, ఆందోళన కార్యక్రమాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అందుకే రేషన్ డీలర్లు రేపటి నుంచి అనగా అక్టోబర్ 1 నుంచి రేషన్ దుకాణాల బంద్‌కు పిలుపునిచ్చారు.


తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు గత 5 నెలల నుంచి ఎలాంటి కమీషన్ అందడం లేదని అంటున్నారు. దీనికి తోడు.. రేషన్ డీలర్లు తమకు నెలకు రూ.5వేలు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీని గురించి వారు గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తూ వచ్చారు. అలానే సోమవారం నాడు తెలంగాణలోని 33 జిల్లాల్లో కలెక్టర్లకి వినతి పత్రాలు కూడా సమర్పించారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం రేషన్ డీలర్ల అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


దీంతో ఇక బియ్యం పంపిణీ చేసేది లేదని రేషన్ డీలర్ల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలో ఏ ప్రభుత్వం కూడా రేషన్ డీలర్ల కమీషన్‌ను పెండింగ్‌లో పెట్టిన దాఖలాలు లేవని వారు తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలపై స్పష్టత ఇస్తేనే తిరిగి రేషన్‌ దుకాణాలు తెరిచి.. సరుకులు పంపిణీ చేస్తామని అంటున్నారు. అలానే రేషన్ డీలర్ల కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలని.. కమీషన్‌ పెంచడంతో పాటు.. రేషన్ షాపుల అద్దె, బియ్యం రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే రేషన్ షాపుల బంద్.. రేపు ఒక్క రోజు మాత్రమే ఉంటుందా.. లేదంటే.. ప్రభుత్వం దిగి వచ్చే దాకా కొనసాగుతుందా అనే అంశంపై క్లారిటీ లేదు. దీనిపై రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ప్రకటన చేస్తారని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa