ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 07:08 PM

తెలంగాణ రాష్ట్రంలో విమానయాన సేవలను విస్తరించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో రెండు ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టు మాత్రమే అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం వరంగల్ మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల పునరుద్ధరణ పనులు వేగవంతం అయ్యాయి. ఈ రెండు విమానాశ్రయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చర్యలు చేపట్టింది. రెండేళ్లలో ఈ ఎయిర్‌పోర్టులు పూర్తయ్యేలా AAI ప్రక్రియను ప్రారంభించింది.


ఇవి కాకుండా గతంలోనే కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులను కూడా ప్రాధాన్యత జాబితాలో చేర్చారు. ఈ రెండు ఎయిర్‌పోర్టులక స్థల పరిశీలన కూడా జరిగింది. తాజాగా నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ జిల్లాల్లోనూ ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.


ఇక వరంగల్ నగరానికి సమీపంలోని మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధరించడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ అవసరమైన చర్యలను చేపట్టింది. ఈ పునరుద్ధరణ పనుల కోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించింది. మొత్తం 949.14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విమానాశ్రయానికి హద్దులు, డీపీఆర్ తయారీ కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ బిడ్‌లను ఆహ్వానించింది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 14 వరకు కన్సల్టెన్సీ సంస్థల నుంచి బిడ్‌లు స్వీకరించడానికి AAI గడువు విధించింది. డీపీఆర్‌ నివేదిక అందిన వెంటనే ఇక్కడ పునరుద్ధరణ పనులను ప్రారంభించనుంది. మామునూరు విమానాశ్రయం రెండేళ్లలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


ఆదిలాబాద్ జిల్లా భారత వాయుసేనకు చెందిన విమానాశ్రయాన్ని కూడా ప్రయాణికుల కోసం పునరుద్ధరించనున్నారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో కేవలం వాయుసేనకు సంబంధించిన విమానాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఉంది. పౌర విమానయాన సేవలు అందించేందుకు ఎయిర్‌పోర్టును పునరుద్ధరించడానికి వాయుసేన నుంచి అంగీకారం లభించింది. ఈ అంగీకారంతో ఆదిలాబాద్‌లో కూడా పూర్తిస్థాయిలో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు AAI సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి కావాల్సిన అదనపు భూమిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ ఆరు విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తే.. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత విమానయాన సేవలు మరింతగా విస్తరించి, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడతాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa