తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై నెలకొన్న వివాదం తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్ సహా పలువురు కోర్టులో పిటిషన్లు వేశారు. అయితే... ఈ రిజర్వేషన్లకు అనుకూలంగా బీసీల తరఫున ఆర్. కృష్ణయ్య, వి. హనుమంతరావు వంటి ప్రముఖ నాయకులు కూడా ఇంప్లీడ్ పిటిషన్లు అంటే మధ్యంతర పిటిషన్లు దాఖలు చేయడం వల్ల ఈ అంశం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక హైకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. అది 50 శాతం పరిమితిని దాటకూడదని స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగాల్లో 50 శాతం దాటినప్పటికీ.. రాజకీయ రిజర్వేషన్లలో ఈ పరిమితిని పెంచకూడదని.. కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీల రిజర్వేషన్లకు మాత్రమే ఈ సీలింగ్ వర్తించదని హైకోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి శాస్త్రీయ ఆధారాలను చూపించలేకపోయిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టులో తన వాదనలు వినిపించారు.
తెలంగాణలో చేపట్టిన కుల గణన గురించి ప్రస్తావిస్తూ.. ఈ లెక్కలను బహిరంగంగా ప్రకటించకుండానే రిజర్వేషన్లను నిర్ణయించడాన్ని తప్పుబట్టారు. బీసీ రిజర్వేషన్లకు కులగణన లెక్కలు ప్రాతిపదికగా చూపుతూ.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు మాత్రం 2011 జనాభా లెక్కలను ఎలా పరిగణనలోకి తీసుకుంటున్నారు? అని ప్రశ్నించారు. 2011 నుంచి ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగిందా లేక తగ్గిందా అనే వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో లేవన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లను ఎలా నిర్ణయించగలుగుతారు? అని ప్రశ్నించారు.
ఇక్కడ గతంలో వెల్లడించిన తీర్పులను ప్రస్తావించారు. ఇదే హైకోర్టు 2018లో బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్లను కూడా కొట్టివేసిన విషయాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణకు మేము వ్యతిరేకం కాదు, కానీ రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? అని ప్రశ్నించారు. ఈ వాదనల అనంతరం హైకోర్టు ధర్మాసనం విచారణను భోజన విరామం తరువాత తిరిగి మొదలుపెట్టేందుకు వాయిదా వేసింది.
లంచ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బలమైన వాదనలను వినిపించారు. ప్రభుత్వం ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన కోర్టుకు వివరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయని.. దీనికి రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించిందని సింఘ్వీ స్పష్టం చేశారు.
చట్టసభలు ఏకగ్రీవంగా ఆమోదించిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరని ఆయన వాదించారు. చట్టాలు చేసే అధికారం, వాటిని సవరించే నిర్ణయం పూర్తిగా శాసనవ్యవస్థదేనని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 పై స్టే ఇవ్వాలని కోరడం న్యాయబద్ధం కాదన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయానికి రావడానికి ప్రామాణికంగా సమగ్ర కులగణన వివరాలను ఆధారంగా తీసుకుంటోందని.. ప్రజా సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆయన తెలియజేశారు.
బీసీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతం పరిమితిని మించి పెంచే అవకాశం ఉందని సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చివరకు రెండు వైపుల వాదనలు విన్న జస్టిస్ విచారణను రేపటికి వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం.. ఈ తీర్పుపైనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa