తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు యాజమాన్యం ఓ శుభవార్తను అందించింది. యూనియన్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని.. సింగరేణి సంస్థ పరిధిలోని కాంట్రాక్ట్ శ్రామికులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సౌకర్యాన్ని వర్తింపజేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ సంచలనాత్మక అడుగుతో వేల సంఖ్యలో ఉన్న శ్రామికులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత దొరకనుంది.
సింగరేణి సంస్థ ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని రెండు ప్రధాన ప్రాంతాలలో మొదలు పెట్టాలని సీఎండీ ఎన్ బలరాం ఆదేశాలు జారీ చేశారు. వాటిలో మొదటిది కార్పొరేట్ ఏరియా.. ఈ విభాగంలో దాదాపు 1,500 మంది ఒప్పంద శ్రామికులకు ఆరోగ్య రక్షణ లభిస్తుంది. రెండోది కొత్తగూడెం ఏరియా.. ఈ ప్రాంతంలో 1,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులకు ఈ బీమా పరిధిలోకి వస్తారు. ఈ భద్రతా పథకం కింద నెలకు రూ.21,000 లేదా అంతకంటే తక్కువ వేతనాలు సంపాదించే కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రమే లబ్ధి పొందుతారు.
ఈఎస్ఐ ద్వారా శ్రామికులు, వారి కుటుంబ సభ్యులు పరిమితి లేకుండా వైద్య చికిత్సలు పొందుతారు. అంతేకాకుండా.. అనారోగ్యం సమయంలో వేతనంతో కూడిన సెలవులు , గర్భిణీ కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు కూడా ఈ పథకం కింద దక్కుతాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఈఎస్ఐసీ వెబ్సైట్లో నమోదు చేసే ప్రక్రియ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అయింది. ఈ నమోదు కార్యక్రమం రెండు రోజుల పాటు సింగరేణి, ఈఎస్ఐ అధికారులు సంయుక్తంగా చేపడతారు.
ఈ పథకం అమలులో సింగరేణి యాజమాన్యం తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటంటే.. సాధారణంగా కాంట్రాక్టర్ చెల్లించాల్సిన 3.75 శాతం వాటాను వారికే ఆర్థిక భారం కాకుండా సింగరేణి సంస్థే భరించడానికి ముందుకు వచ్చింది. శ్రామికులు మాత్రం తమ వేతనం నుంచి 0.75 శాతం చొప్పున మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. నమోదు కోసం కాంట్రాక్టు ఐడీ, ఆధార్ నంబర్లు, సీఎస్టీ వివరాలు, వేతన స్టేట్మెంట్లు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలతో నిర్ణీత సమయంలో శ్రామికులు హాజరుకావాలని అధికారులు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa