ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానాస్పదంగా మహిళా ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 05:08 PM

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుమారుడి కళ్లెదుటే ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయింది. అనారోగ్యం కారణంగా కన్నతల్లిని కాపాడుకోలేక నిస్సహాయంగా రోదించాడా బాలుడు. వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన సుధ(42), నర్సింహ దంపతులు బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చారు. నాలుగేళ్లుగా వనస్థలిపురం సమీపంలోని మారుతీనగర్‌లో ఓ పెంట్‌ హౌస్‌లో అద్దెకు ఉంటున్నారు. ఈ దంపతులకు 18, 13 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు బాల్యం నుంచే మధుమేహంతో బాధపడుతున్నాడు. భవన నిర్మాణ మేస్త్రీగా పనిచేస్తున్న నర్సింహ మద్యానికి బానిసకావడంతో సుధ ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. డబ్బులేక చిన్న కుమారుడికి వైద్యం చేయించలేకపోతున్నానంటూ సుధ తరచూ పక్కింటి వాళ్ల ముందు వాపోయేది. ఇటీవల పెద్దకొడుకు పక్కింట్లో ఇనుపరాడ్డు చోరీ చేయగా ఆ యజమాని మందలించాడు.ఈ గొడవతో మనస్తాపానికి గురైన సుధ.. మంగళవారం రాత్రి పెద్ద కుమారుడిని బజారుకు పంపించింది. ఇంట్లోనే ఉన్న చిన్న కుమారుడు చూస్తుండగానే సీలింగ్‌ ఫ్యానుకు చీరతో ఉరేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు తల్లిని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఈలోగా బజారు నుంచి తిరిగి వచ్చిన పెద్ద కుమారుడు.. చుట్టుపక్కల వారిని పిలిచి తల్లిని కిందకి దింపి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించాడు. అయితే, అప్పటికే ఊపిరిఆడక సుధ మరణించిందని వైద్యులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa