ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో కొత్త రకం మోసం,,,,తమ ప్రయోజనం కోసం సామాన్యులను పాచిక చేస్తూ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 07:03 PM

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కొత్త రకం మోసం వెలుగు చూస్తోంది. ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, అడ్డా కూలీలు వంటి సామాన్య ప్రజలను కొందరు కేటుగాళ్లు తమ అక్రమ లావాదేవీలకు వాడుకుంటున్నారు. వీరికి తెలియకుండానే.. ఈ అమాయక ప్రజలు ఒక్కసారిగా రికార్డుల్లోకి కుబేరులుగా మారిపోతున్నారు. వీరి పేర్ల మీద బోగస్ కంపెనీలు సృష్టించి.. కోట్ల రూపాయల టర్నోవర్ జరిగినట్టు లెక్కలు చూపిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఈ మోసగాళ్లు పన్నులు ఎగ్గొట్టడానికి, జీఎస్టీ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సబ్సిడీని అక్రమంగా పొందడానికి ఈ సామాన్యులను పావులుగా ఉపయోగిస్తున్నారు.


ఈ మోసాలు ఎలా జరుగుతున్నాయంటే.. మోసగాళ్లు ముందుగా సామాన్యుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. వ్యక్తిగత లోన్, హౌస్ లోన్లు బ్యాంక్ నుంచి ఇప్పిస్తామని.. స్వచ్ఛంద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని నమ్మబలుకుతారు. దీని కోసం ఆ ఆటో డ్రైవర్లు, టీ కొట్టు నిర్వాహకులు, అడ్డా కూలీలు.. తమ ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీల జిరాక్స్ కాపీలను ఇస్తారు.


కీలకమైన విషయం ఏమిటంటే.. కేవలం ఆధార్ కార్డు ఆధారంగానే జీఎస్టీ టిన్ నంబర్‌ను పొందే వెసులుబాటును ఈ కేటుగాళ్లు తమ నేరాలకు తెలివిగా వాడుకుంటున్నారు. ఆ పత్రాలను ఉపయోగించి బోగస్ సంస్థల పేరిట జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఆ టిన్ నంబర్ల ద్వారా అసలు జరగని వ్యాపార లావాదేవీలు జరిగినట్లు నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి, వాటిని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సబ్సిడీని దొంగిలిస్తున్నారు.


నోటీసులు వచ్చిన తర్వాతే అసలు విషయం..


ఈ మోసపోయిన అమాయకులకు తాము చేసిన వ్యాపారం గురించి గానీ.. కోట్ల టర్నోవర్ గురించి గానీ అసలు తెలియదు. ఎప్పుడైతే జీఎస్టీ అధికారులు ఇంటికొచ్చి.. వారి పేరిట వందల కోట్ల లావాదేవీలు జరిగాయని నోటీసులు ఇస్తారో.. అప్పుడే వారు ఉలిక్కిపడి తాము మోసపోయినట్లు తెలుసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో రుణం కోసం ప్రయత్నించిన ఒక ఆటో డ్రైవర్‌కు ఇలాగే రూ. 100 కోట్ల టర్నోవర్‌పై జీఎస్టీ నోటీస్ వచ్చింది. దీంతో తినడానికే సరిగ్గా తిండి లేక.. ఉండటానికి ఇళ్లు లేని తమ జీవితం దుర్భరంగా ఉంటే.. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని వారు బాధపడి, ఆ నోటీసులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పోలీసులు, లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు.


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఈ ఏడాది 12 నుంచి 15 వరకు ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇందులో కొన్ని ట్రేడింగ్ కంపెనీలు ఏపీ, మహారాష్ట్రల వ్యాపారులకు ముడి ఇనుము సరఫరా చేసినట్లు లెక్కలు చూపించి.. నకిలీ బిల్లులతో ఏకంగా రూ. 33 కోట్ల ITC పొందారు. అందుకే పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మీరు ఈ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో.. మీ ఆధార్, పాన్ వంటి ముఖ్యమైన పత్రాలను ఎవరికీ ఇవ్వకూడదు. రుణం తీసుకోవాలంటే నేరుగా బ్యాంకులను మాత్రమే సంప్రదించండి.


ఏదైనా కంపెనీలో ఉద్యోగానికి లేదా మరేదైనా అవసరానికి మీ ఐడీ పత్రాలు అడిగితే.. ఆ సంస్థకు సరైన చిరునామా, ఫిజికల్ ఆఫీస్ ఉన్నాయా లేదా అని పరిశీలించండి. ఆన్‌లైన్‌లో కంపెనీ వివరాలు కనిపించకపోతే అది బోగస్ అయ్యే అవకాశం ఉంది. జీతం ఇవ్వడానికి ముందు డబ్బు కట్టమని అడగడం, లేదా అధిక ధర కలిగిన వస్తువులు కొని తిరిగి పంపమని అడగడం వంటివి జరిగితే అది మోసమే అని గుర్తించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa