ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించిన తలసాని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 09:15 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో తనపై వస్తున్న ఊహాగానాలకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుల్‌స్టాప్ పెట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో బంధుత్వం ఉన్నప్పటికీ, తన పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. బంధుత్వం వేరు, రాజకీయ అనుబంధం వేరని స్పష్టం చేస్తూ, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ అర్ధాంగి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. అయితే, నవీన్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బంధువు కావడంతో, ఆయన మద్దతు ఎవరికి ఉంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ ప్రచారంపై సికింద్రాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తలసాని స్పష్టత ఇచ్చారు."నవీన్ యాదవ్‌తో నాకు బంధుత్వం ఉన్న మాట నిజమే. గతంలో అతనికి రాజకీయంగా కొన్ని సూచనలు కూడా ఇచ్చాను. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. అలాంటప్పుడు మా పార్టీ అభ్యర్థిని కాదని వేరే వారికి ఎలా మద్దతిస్తాను అని తలసాని ప్రశ్నించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నానని ఆయన పునరుద్ఘాటించారు.పార్టీ కార్యక్రమాల్లో తాను చురుగ్గా పాల్గొంటున్నానని తలసాని గుర్తుచేశారు. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా గురువారం కేటీఆర్‌తో కలిసి బస్ భవన్‌కు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. తన విధేయత ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీకేనని, జూబ్లీహిల్స్‌లో తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసమే పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa