హైదరాబాద్ రిజినల్ రింగు రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు తమ సమస్యపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో వంద మందికి పైగా భూనిర్వాసితులు నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన కొందరు భూనిర్వాసితులు శనివారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రీజినల్ రింగు రోడ్డు నిర్మాణంతో తమ భూములను కోల్పోతున్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. రింగు రోడ్డు అలైన్మెంట్ను ప్రస్తుత ఓఆర్ఆర్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు తాము తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న భూముల, ఇళ్లను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీజినల్ రింగు రోడ్డు పరిధిలోని అన్ని గ్రామాల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భూనిర్వాసితులంతా పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి తమ నిరసనను తెలియజేయాలని ప్రణాళికలు రూపొందించారు.
అయితే ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో ఆందోళనలో ఉన్న రైతులు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. తక్షణమే జరగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికను తమ నిరసనను బలంగా వినిపించడానికి ఒక వేదికగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ నియోజకవర్గంలో వంద మందికి పైగా భూనిర్వాసితులు నామినేషన్లు వేయడం ద్వారా తమ సమస్య తీవ్రతను రాష్ట్ర,జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
భూనిర్వాసితులు ఏకకాలంలో ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతుండటం రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఒక సవాలుగా మారే ఛాన్స్ ఉంది. ఈ పరిణామం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రైతుల సమస్యపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. ఈ నామినేషన్ల ప్రక్రియను ఎలా ఎదుర్కొంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. భూనిర్వాసితుల ఈ నిరసన చర్య, పరిహారం, అలైన్మెంట్ మార్పు వంటి తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చుకునే దిశగా ప్రభుత్వానికి ఒక గట్టి సందేశాన్ని పంపనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa