తెలంగాణ రాజకీయాలలో కుల పరమైన విమర్శలు, ఆధిపత్య పోరు తాజాగా మరోసారి చర్చకు వచ్చింది. నిజామాబాద్లో జరిగిన మాలల ఐక్యతా సదస్సు వేదికగా మంత్రి వివేక్ వెంకటస్వామి తనపై జరుగుతున్న కుట్రలు, వ్యక్తిగత దాడిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆయన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేరు ప్రస్తావించడం రాజకీయ విభేదాలను స్పష్టంగా బయటపెట్టింది.
సోషల్ మీడియా వేదికగా..
మంత్రి వివేక్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా తనను లక్ష్యంగా చేసుకుని.. కులపరమైన కుట్రలు, విమర్శలు జరుగుతున్నాయని ఆరోపించారు. అడ్లూరి లక్ష్మణ్ను కొందరు రెచ్చగొట్టి తనపై నిరాధారమైన ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ విజయం సాధిస్తే.. తనకు మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో కొందరు ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారని వివేక్ పేర్కొన్నారు. రాజకీయాల్లో తనకు మంత్రి పదవిపై ఎలాంటి వ్యామోహం లేదని.. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. అడ్లూరి లక్ష్మణ్ను రాజకీయంగా ప్రోత్సహించింది తన తండ్రి.. దివంగత సీనియర్ నేత కాకా వెంకటస్వామియే అని వివేక్ గుర్తుచేశారు. ఈ విషయాన్ని లక్ష్మణ్ మర్చిపోయారని ఆయన బాధ వ్యక్తం చేశారు. తనకు లక్ష్మణ్తో ఎలాంటి విభేదాలు లేవని.. కానీ కొందరు మాలలు, మాదిగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మాలల హక్కుల కోసం పోరాటం..
ఈ ఐక్య సదస్సులో మంత్రి వివేక్ మాలల జాతి హక్కుల కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా రోస్టర్ వ్యవస్థపై మాలలు వ్యక్తం చేస్తున్న ఆందోళనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. నిజాయితీగా పనిచేయాలని తన తండ్రి తనకు సలహా ఇచ్చారని.. అందుకే తాను నిస్వార్థ సేవకుడిని అని వివేక్ చెప్పారు. కష్టపడి పనిచేస్తున్న తనపై ఓర్వలేని కొందరు వ్యక్తులు నిందలు వేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యం అని..అటువంటి విమర్శలను తాను పట్టించుకోనని ధైర్యంగా చెప్పారు. కలిసి ఉంటేనే కుల వివక్షను ఎదుర్కోగలమని.. అందుకే మాలలు, మాదిగలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని వివేక్ పిలుపునిచ్చారు. తాను ఎప్పుడూ న్యాయం వైపే ఉంటానని చెప్పుకొచ్చారు.
అడ్లూరి లక్ష్మణ్ స్పందన..
మంత్రి వివేక్ చేసిన వ్యాఖ్యలపై సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ఒక మీడియా ఛానల్తో మాట్లాడిన ఆయన.. ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఇకపై తాను మాట్లాడబోనని.. ఈ వివాదాన్ని అధిష్ఠానం చూసుకుంటుదన్నారు. వివేక్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. అంతేకాక.. వివేక్ కుమారుడు (గడ్డం వంశీ కృష్ణ) ఎంపీగా గెలవడానికి ఎవరు కృషి చేశారో వివేక్కు కూడా తెలుసని పరోక్ష విమర్శ చేశారు. ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో బహిరంగంగా చర్చకు సిద్ధమని అడ్లూరి లక్ష్మణ్ సవాలు విసిరారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ మంత్రుల వివాదాన్ని పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa