ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ మహిళలకు.. ఆ రోజు నుంచే ఉచిత చీరల పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 06:32 PM

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ కానుకగా.. రాష్ట్ర మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పేరుతో చీరలు పంపిణీ చేయాలనుకుంది. కానీ అది సాధ్యపడలేదు. దీంతో చీరల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. పండుగ తర్వాత పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే ఈ చీరల పంపిణీని దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున (నవంబర్‌ 19న) ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,848 స్వయం సహాయకం బృందాల్లో (ఎస్‌హెచ్‌జీ).. 1.94లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూపుల్లో ఉన్న వారందరికీ.. ఒక్కో చీర చొప్పున ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అంటే మొత్తం 1.94 లక్షల చీరలు అవసరం అవుతాయన్నమాట. అయితే ఇందులో జిల్లాలకు 50 శాతం చీరలు మాత్రమే సరఫరా అయ్యాయి. వాటిని గోదాముల్లో భద్రపరిచారు. మిగతా 50 శాతం చీరలు త్వరలో జిల్లాలకు సరఫరా కానున్నాయి.


క్వాలిటీలో రాజీ లేదు..


సెర్ప్‌, మెప్మా వంటి మహిళా సంఘాలకు నాయకత్వం వహించే సంస్థలు ఈ ఉచిత చీరలను పంపిణీ చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్‌ ఆధ్వర్యంలో.. అర్బన్ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు చీరలు అందించనున్నారు. రెండు రకాలుగా ఈ చీరలను అందించనున్నారు. యవ, మధ్య వయస్కులకు 6.5 మీటర్లు, వృద్ధుల కోసం 9 మీటర్ల చీరలను పంపిణీ చేయనున్నారు. కాగా, చీరల నాణ్యత విషయంలో ఆరోపణలకు అవకాశం లేకుండా.. సిరిసిల్ల, కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతాల్లో మగ్గాలపై తయారు చేయించి.. పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కోటి రూ. 800 విలువ గల చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఉచితంగా చీరలను ఇవ్వడం ప్రారంభించింది. సరిగ్గా బతుకమ్మ నాటికి చీరలను పంపిణీ పూర్తి చేసేది. అయితే బీఆర్ఎస్ సర్కార్ పంపిణీ చేసిన చీరలు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ.. బతుకమ్మ పండుగకు నాణ్యమైన చీరలు ఇస్తామని ప్రకటించింది. అందుకోసం చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలను తయారీ చేయిస్తున్నారు. అయితే బతుకమ్మ నాటికి చీరలు సిద్ధం కాకపోవడంతో పంపిణీ వాయిదా పడింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్‌ 15 నాటికి చీరల తయారీ పూర్తి చేసి.. నవంబర్ 19న పంపిణీ చేయాలని నిర్ణయించింది. చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, జౌళి శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌.. చీరల తయారీ, పంపిణీ గురించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa