ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 06:26 AM

తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం రెండో రోజు మరో 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో ఇప్పటివరకు నామినేషన్లు వేసిన వారి సంఖ్య 21కి చేరినట్లు రిటర్నింగ్ అధికారి పి. సాయిరాం వెల్లడించారు. రెండో రోజు నామినేషన్లు వేసిన వారిలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారని ఆయన తెలిపారు.మంగళవారం పత్రాలు సమర్పించిన వారిలో పాట పార్టీ తరఫున ఎం. వెంకట్ రెడ్డి, అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మహమ్మద్ మన్సూర్ అలీ, శరంజీవి పార్టీకి చెందిన జాజుల భాస్కర్, ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ నుంచి ఎల్. చంద్రశేఖర్ వంటి వారు ఉన్నారు. సోమవారం నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవగా, ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల తరఫున నామినేషన్లు దాఖలు చేయకపోవడం గమనార్హం.సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్  జూన్‌లో మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా గోపీనాథ్ అర్ధాంగి మాగంటి సునీతను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్‌ను బరిలోకి దించింది. బీజేపీ తన అభ్యర్థిని ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. 2023 ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ అభ్యర్థి, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్‌పై 16,337 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన గుండెపోటుకు చికిత్స పొందుతూ మరణించారు. దాంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నినిక అనివార్యమైంది. అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి, 14న ఓట్లను లెక్కించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa