సామాన్యుడికి ఉపయోగపడని సాంకేతికత, పరిశోధనల వల్ల ప్రయోజనం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రూ.6,000 ఖర్చయ్యే ఆర్టీపీసీఆర్ టెస్టును కేవలం రూ.12కే అందుబాటులోకి తెచ్చిన హ్యూవెల్ సంస్థ కృషి అద్భుతమని ఆయన కొనియాడారు. తెలంగాణలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్లో హ్యూవెల్ ఏర్పాటు చేసిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్ను కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వినియోగించే వైద్య పరికరాల్లో దాదాపు 70 నుంచి 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ పరిస్థితిని మార్చి, మన దేశంలోనే తక్కువ ధరకు నాణ్యమైన పరికరాలను ఉత్పత్తి చేయాలనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారి హయాంలో ఈ మెడికల్ డివైసెస్ పార్క్ను ఏర్పాటు చేశాం అని తెలిపారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, వైద్య ఖర్చులను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.ఒకప్పుడు రాళ్లు, క్రషర్లతో నిండిన సుల్తాన్పూర్ ప్రాంతం నేడు వేలాది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక కేంద్రంగా మారడం ఎంతో సంతోషాన్నిస్తోందని కేటీఆర్ అన్నారు. కోవిడ్ కష్టకాలంలో టెస్టింగ్ కిట్లకు తీవ్రమైన కొరత, అధిక డిమాండ్ ఉండేదని గుర్తుచేశారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ల వంటి ఆవిష్కరణలతో ప్రజలకు మేలు చేసిన హ్యూవెల్ యాజమాన్యం, శిశిర్, రచన బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన వ్యర్థమని కేసీఆర్ గారు మాకు ఎప్పుడూ చెబుతుంటారు. ఆ మాటలను నిజం చేస్తూ హ్యూవెల్ పనిచేస్తోంది అని అన్నారు. సంస్థ పదవ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ఇంకో రెండేళ్లలో మేం అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత పరిశ్రమలకు మరింత అండగా నిలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శాంత బయోటెక్ ఎండీ వరప్రసాద్ రెడ్డి, హ్యూవెల్ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa