తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ హామీల అమలుపై దృష్టి సారించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 'జాగృతి జనయాత్ర' చేపట్టనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు జాగృతి నాయకులు అధికారికంగా వెల్లడించారు.ఈ యాత్రకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా జాగృతి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి రాష్ట్ర నాయకులు కోల శ్రీనివాస్, నరేష్, అర్చన సేమపతి హాజరయ్యారు. యాత్రను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా ముఖ్య నాయకులతో వీరు సమీక్ష నిర్వహించారు.సామాజిక తెలంగాణ సాధన, బీసీ రిజర్వేషన్ల పెంపు, ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల అమలు వంటి ప్రధాన డిమాండ్లతో కవిత ప్రజల ముందుకు వెళ్లనున్నారని నాయకులు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ నిరుద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారి లావణ్యతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు ముస్తఫా, రామకోటి, రాము యాదవ్, నవీన్ గౌడ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa