కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యే పేరును కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అంటే ‘ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ’ కాదని, అది ‘ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ’ అని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం ఖైరతాబాద్లోని బస్తీ దవాఖానాను సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ఉండటాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. "కాంగ్రెస్ పార్టీకి నీతి, రీతి ఏమైనా ఉన్నాయా" అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రలోభపెట్టి చేర్చుకుందని, ఇది అవినీతి కాదా అని నిలదీశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ వద్ద ఒకలా, బయట మరోలా మాట్లాడుతున్నారని, అసలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో వారున్నారని విమర్శించారు. దమ్ముంటే వారంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని కేటీఆర్ సవాల్ విసిరారు.ఇదే సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై పోరాడేందుకు బీఆర్ఎస్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య నేతృత్వంలో, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతకు ఆనంద్ సభ్యులుగా ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి, అక్కడి సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక ఇస్తుందన్నారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు. అలాగే, బస్తీ దవాఖానా, అంగన్వాడీ సిబ్బందికి జీతాలు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa