ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్ వాడేవారికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో బిగ్ అలర్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 05, 2025, 07:45 PM

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త విధానంతో మోసాలకు పాల్పడుతున్నారు. రోజురోజుకూ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. ఈ సైబర్ దాడులు కూడా అదే స్థాయిలో పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సెల్‌ఫోన్లు హ్యాక్ చేసి.. వాటిలోని డబ్బులు, సున్నితమైన సమాచారం, ఫోటోలు, వీడియోలను స్మార్ట్‌గా కొట్టేస్తున్నారు. ఎక్కడో ఉండి.. ఇక్కడ ఉన్న మన ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఇక సైబర్ పోలీసులు, నిపుణులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత అవగాహన కల్పించినా.. సైబర్ నేరగాళ్లు మాత్రం రకరకాల కొత్త ఉపాయాలతో ప్రజలను బురిడీ కొట్టించి.. దోచుకుంటున్నారు. ఈ క్రమలోనే అత్యధిక మంది ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్‌ను బేస్ చేసుకుని కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు.


వాట్సాప్ హ్యాకింగ్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీసీఎస్‌బీ) యూజర్లకు వార్నింగ్‌తో కూడిన అడ్వైజరీని జారీ చేసింది. వాట్సాప్ ద్వారా మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయి.. ఫోన్ హ్యాక్ అయ్యిందని అనుమానం వస్తే ఏం చేయాలి.. ఫిర్యాదులు ఎలా నమోదు చేయాలనే అంశాలపై పూర్తి వివరాలు వెల్లడించింది.


సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త ట్రిక్స్


సైబర్ నేరగాళ్లు ఇప్పుడు అమాయక ప్రజలను టార్గెట్ చేయడానికి ప్రధానంగా రెండు మార్గాలను ఉపయోగిస్తున్నారు. అందులో ఒకటి నకిలీ ఏపీకే ఫైళ్లను పంపించడం.. ఇంకోటి.. కాల్ ఫార్వర్డింగ్ ట్రిక్.


ఫేక్ ఏపీకే ఫైల్ మోసం (ఆండ్రాయిడ్ యూజర్లకు)


సైబర్ నేరగాళ్లు ఈ ఫేక్ ఏపీకే ఫైళ్లను మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్‌గా చేసుకుని పంపిస్తున్నారు. ఆర్టీఏ చలాన్, బ్యాంక్ కేవైసీ అప్‌డేట్, కొరియర్ నోటీస్, లేదా ఫేక్ ఇన్వాయిస్ చెల్లింపులు, కొత్త వీడియో/ఫోటో షేరింగ్ యాప్ పేర్లతో వాట్సాప్‌లో లింకుల రూపంలో డేంజరస్ ఏపీకే ఫైళ్లను పంపిస్తారు.


ఇక వాట్సాప్ యూజర్లు ఆ లింక్‌ను నొక్కి.. అందులో వచ్చే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత.. ఎస్ఎంఎస్/ఓటీపీలు రీడ్ చేసేందుకు అనుమతి ఇవ్వగానే.. సైబర్ నేరగాళ్లు ఆ ఓటీపీని ఉపయోగించి.. అదే ఫోన్ నెంబర్‌తో వాళ్ల ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేస్తారు. దీంతో వెంటనే మీ ఫోన్‌లో ఉన్న వాట్సాప్ లాగ్ అవుట్ అవుతుంది. ఇక ఆ వాట్సాప్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఫ్యామిలీని డబ్బు అడగడానికి ఉపయోగించుకుంటారు.


కాల్ ఫార్వార్డింగ్ ట్రిక్ (ఐఫోన్ యూజర్ల కోసం)


ఈ సైబర్ మోసంలో.. సైబర్ నేరగాళ్లు యూజర్‌ను 21*నంబర్# వంటి ఒక స్పెషల్ నంబర్‌ను డయల్ చేయాలని సూచిస్తారు. అది నిజానికి కాల్ ఫార్వార్డింగ్ కోడ్. ఆ కోడ్‌ను డయల్ చేయగానే.. మన ఫోన్లకు వచ్చే ఓటీపీలు, వెరిఫికేషన్ కాల్స్ అన్నీ నేరుగా సైబర్ నేరగాళ్లకు ఫార్వర్డ్ అవుతాయి. దీని ద్వారా మన వాట్సాప్‌ను హ్యాక్ చేస్తారు.


మొబైల్ హ్యాక్ అయ్యిందని అనుమానం వస్తే..!


హ్యాకింగ్ బారిన పడిన లేదా అనుమానం ఉన్న యూజర్ల కోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎమర్జెన్సీ సూచనలు జారీ చేసింది. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వెంటనే కాల్ ఫార్వర్డింగ్‌ను వెంటనే నిలిపివేయాలని సూచించింది. ముఖ్యమైన ఫొటోలు, ఫైల్స్‌ను వెంటనే బ్యాకప్ చేసుకోవాలని పేర్కొంది. తెలియని లేదా అనుమానాస్పదంగా ఉన్న ఏ యాప్‌నైనా వెంటనే అన్‌ ఇన్‌స్టాల్ చేయాలని వెల్లడించింది. ఫాక్టరీ రీసెట్ చేసి.. మొబైల్‌లోని మాల్వేర్‌ను, రహస్యంగా దాగి ఉన్న ఆప్షన్స్‌ను పూర్తిగా తొలగించాలని హితవు పలికింది.


ఇక అవసరమైన యాప్స్‌ను మళ్లీ గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలని సూచించింది. వాట్సాప్‌ను మళ్లీ సొంత నంబర్‌తో వెరిఫై చేయండని తెలిపింది. హైడ్ లేదా ప్రమాదకర యాప్‌లను గుర్తించడానికి ప్రభుత్వ మొబైల్ సెక్యూరిటీ యాప్ అయిన M-Kavach 2ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని హితవు పలికింది.


తప్పనిసరిగా పాటించాల్సిన భద్రతా జాగ్రత్తలు


వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను లేదా తెలియని యాప్‌లను ఎప్పుడూ ఇన్‌స్టాల్ చేయవద్దని సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలిపింది. వాట్సాప్‌లో తప్పనిసరిగా 2 స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలని సూచించింది. 21*నంబర్# వంటి ప్రత్యేక నంబర్‌లను ఎవరైనా డయల్ చేయాలని సూచిస్తే ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దని.. అవి కాల్ ఫార్వర్డింగ్ నంబర్లు కావొచ్చని పేర్కొంది. సైబర్ మోసానికి గురై డబ్బు పోగొట్టుకుంటే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్ చేయాలని.. లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa