తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు భారీగా పెరిగాయి. కొత్త ధరలు లక్షలకన్నా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలు-1989లోని రూల్ 81లో సవరణలు చేసి, శనివారం జీ.ఓ నెం.77 విడుదల చేసింది.ఇప్పటి నుంచి ఫ్యాన్సీ నంబర్ల కోసం దరఖాస్తులు కేవలం ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఒకే నంబర్ కోసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది దరఖాస్తు చేస్తే, నంబర్ను వేలం ద్వారా కేటాయిస్తారు.ఉదాహరణకు, 9999 ఫ్యాన్సీ నంబర్ గతంలో 50,000 రూపాయలకే లభించేది. ఇప్పుడు అదే నంబర్ లక్షల రూపాయలకూ పైగా ఉంది. కొత్త ఆన్లైన్ విధానం ప్రకారం వాహనదారులు రవాణా శాఖ పోర్టల్ (www.transport.telangana.gov.in)లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఫీజుల పెంపుతో రవాణా శాఖ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో హైదరాబాద్లోని ఐదు ఆర్టీఏల ద్వారా ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రికార్డు స్థాయిలో 124.2 కోట్లు ఆదాయం సమకూర్చారు. తాజా సవరణలతో ఈ ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.కొత్త నిబంధనలపై ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు లేదా సలహాలు ఉంటే, వాటిని 30 రోజుల్లో రవాణా శాఖ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి పంపవచ్చని జీ.ఓ స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa